‘అనుమానపు భర్తతో వేగలేను’

20 Mar, 2018 12:28 IST|Sakshi

ఆదోని టౌన్‌:  అనుమానపు భర్తతో కాపురం చేయలేనని, తనకు న్యాయం చేయాలని పెద్ద కడబూరు మండలం దొడ్డిమేకల గ్రామానికి చెందిన వివాహిత ఈడిగ లక్ష్మి పోలీసులను ఆశ్రయించింది. భర్త చేతిలో గాయపడి ఆదోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మేకడోన గ్రామానికి చెందిన లక్ష్మిని తొమ్మిది నెలల క్రితం దొడ్డమేకల గ్రామానికి చెందిన వెంకటేష్‌కు ఇచ్చి వివాహం చేశారు. నెల వ్యవధిలోనే భార్యపై వెంకటేష్‌ అనుమానం పెంచుకున్నాడు.

ఇంట్లో, బయట ఎవరితోనైనా మాట్లాడినా అనుమానిస్తూ వేధించేవాడు. భర్తకు తోడుగా మామ ఉరుకుందప్ప, అత్త లక్ష్మమ్మ, ఆడపడుచు ఈరమ్మ చిన్న విషయాన్ని పెద్దదిగా చేస్తూ సూటిపోటి మాటలతో హింసించారు. మూడు రోజుల క్రితం భార్యను చావబాదాడు. దాడిలో ఆమె చేయి విరిగింది. ఉగాది పండుగ కోసం కుమార్తెను పుట్టింటికి తీసుకెళ్లేందుకు తల్లి ముత్తమ్మ ఆదివారం ఉదయం మేకడోణకు వచ్చింది. గాయపడిన కుమార్తెను ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించింది. బాధితురాలు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పెద్దకడబూరు పోలీసులకు సమాచారం అందించామని ఆదోని ఆసుపత్రి అవుట్‌ పోస్ట్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ చింతలయ్య తెలిపారు.  

మరిన్ని వార్తలు