కొనసాగిన నిరసనల పర్వం; ‘అవిశ్వాసం’ మళ్లీ వాయిదా

20 Mar, 2018 12:29 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: అదే రభస.. అదే తీరు.. మళ్లీ అదే నిర్ణయం! ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన పోరాటంలో భాగంగా కేంద్ర సర్కారుపై వైఎస్సార్‌సీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం మరోసారి వాయిదా పడింది. మంగళవారం కూడా లోక్‌సభలో నిరసనలు చోటుచేసుకోవడంతో.. సభ ఆర్డర్‌లో లేదన్న కారణంగా స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ‘అవిశ్వాసం’చర్చను చేపట్టలేకపోయారు. విపక్షాల ఆందోళనల మధ్యే విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌.. ఇరాక్‌లో భారత బందీల మరణానికి సంబంధించిన ప్రకటన చేశారు. అనంతరం స్పీకర్‌ సభను బుధవారానికి వాయిదావేశారు. అవిశ్వాసంపై చర్చ కోసం గట్టిగా పోరాడుతున్న వైఎస్సార్‌సీపీ నాలుగోసారి నోటీసులు ఇవ్వనుంది.

వైఎస్సార్‌సీపీ విజ్ఞప్తి చేసినా.. : అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగేలా చూడాలని లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌కు వైఎస్సార్‌సీపీ ఎంపీలు విజ్ఞప్తి చేశారు. లోక్‌సభ ప్రారంభం కావడానికి ముందు మంగళవారం ఉదయం మహాజన్‌ను ఆమె కార్యాలయంలో కలిశారు. ఇటు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ కూడా పార్టీల సహకారాన్ని కోరుతూ ప్రకటన చేశారు. కాగా, టీఆర్‌ఎస్‌, ఏఐడీఏంకే పార్టీలు నిరంతరాయంగా నిరసనలు తెలపడంతో, సభ ఆర్డర్‌లో లేని కారణాన్ని చూపుతూ స్పీకర్‌ అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు తీసుకోలేదు.

రాజ్యసభ కూడా: రెండో విడత బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం నుంచి దిగువ సభ మాదిరే పెద్దలసభలోనూ ఆందోళనలు వ్యక్తం తెలిసిందే. నేడు కూడా అలాంటి పరిస్థితే తలెత్తింది. ప్రత్యేక హోదా అంశంపై కేంద్రం తీరును కాంగ్రెస్‌ తప్పుపట్టింది. ఈ క్రమంలో సభలో గందరగోళం నెలకొనడంతో చైర్మన్‌ వెంకయ్యనాయుడు రాజ్యసభను రేపటికి వాయిదావేశారు.

మరిన్ని వార్తలు