వివాహితతో ప్రేమ.. అర్థరాత్రి ఆమె కోసం..

11 Jul, 2019 10:34 IST|Sakshi

ముంబై : వివాహితతో ఓ యువకుడి ప్రేమ కథ విషాదంగా ముగిసింది. అర్థరాత్రి ఆమెను కలుసుకోవటానికి అతడు చేసిన ప్రయత్నం ప్రాణాలు బలి తీసుకుంది. ఈ సంఘటన ముంబైలోని అగ్రిపద పోలీస్ స్టేషన్‌ పరిథిలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బీహార్‌కు చెందిన 19 ఏళ్ల యువకుడు కొద్దినెలలుగా ముంబైలోని తన మేనమామతో కలిసి ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాడు. కొద్దిరోజుల క్రితం అతడికి అదే అపార్ట్‌మెంట్లో నివాసముంటున్న ఓ వివాహితతో పరిచయం అయింది. పరిచయం కాస్తా ప్రేమకు దారితీసి, ఆమెను కలుసుకోవటానికి తరచుగా ఆమె ఉంటున్న ఫ్లాటుకు వెళ్లేవాడు. ఈ నేపథ్యంలో ఓ రోజు అతడు ఆమె ప్లాటుకు వెళ్లి తిరిగి వస్తుండగా మేనమామ కంటపడ్డాడు. దీంతో అతడు అల్లుడ్ని దండించాడు. ఇక అప్పటినుంచి మేనమామ కంటపడకుండా చాటుగా అర్థరాత్రి వేళ ఆమెను కలుసుకునే వాడు. మంగళవారం రాత్రి కూడా ఆమెను కలుసుకోవటానికి బయలుదేరాడు. నేరుగా వెళితే మేనమామ చూసే అవకాశం ఉంటుందని భావించాడు.  ఆమె ఉంటున్న ఫ్లాటు 9వ అంతస్తులో ఉండటంతో కిటికీల గుండా పైకి చేరుకున్నాడు.

వివాహిత ఫ్లాటు వద్దకు చేరుకోగానే అక్కడ ఆమె భర్త ఉండటం గమనించాడు. దీంతో చేసేదేమీలేక కిటికీ గుండా వెనక్కి తిరిగిరావడానికి ప్రయత్నించాడు. అయితే వర్షాల కారణంగా కిటికీ గోడలు తడిచి ఉండటంతో ఒక్కసారిగా పట్టుతప్పి కిందపడి చనిపోయాడు. మరుసటి రోజు ఉదయం వాటర్‌ ట్యాంక్‌ నింపటానికి వెళ్లిన వాచ్‌మెన్‌ రక్తపు మడుగుల్లో ఉన్న యువకుడిని గమనించి పోలీసులకు సమాచారం అందించాడు. వాచ్‌మెన్‌ సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు యువకుడిని ఆసుపత్రికి తరలించారు. అతడిని పరీక్షించిన వైద్యులు చాలాసేపటి క్రితమే చనిపోయినట్లు నిర్థారించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసుల విచారణంలో వివాహితను కలుసుకోవటానికి వెళ్లే ప్రయత్నంలోనే అతడు మృతి చెందాడని తేలింది.

మరిన్ని వార్తలు