బరువు రెండున్నర కిలోలు..ధర రూ.7 వేలు..

28 Aug, 2016 23:26 IST|Sakshi
బరువు రెండున్నర కిలోలు..ధర రూ.7 వేలు..
రావులపాలెం: గోదావరి నీటితో పెరిగిన చెట్లకు కాసే ఫలాలు రుచా, ఆ నీటిలో లభించే పులస చేపలు రుచా.. అని మాంసాహార ప్రియులను అడిగితే ‘రెండోదే’ అని ఠక్కున చెపుతారు. సీజనల్‌గానే దొరికే గోదావరి పులసల ధర కూడా అందుకు తగ్గట్టే వరద గోదావరంత వడివడిగా పెరిగిపోతుంటుంది. మామూలుగా మత్స్యకారులు ఈ సీజన్‌లో వేటకు వెళ్లే ముందు ‘ఒక్క పులస దొరికితే చాలు.. పంట పండినట్టే’ అనిభావిస్తారు. ప్రస్తుతం కేజీ బరువైన పులస దొరకడమే అరుదుగా మారింది. ఈ తరుణంలో ఓ మత్స్యకారుని వలలో రెండున్నర కేజీల పులస చిక్కుకుని, అతడికి కాసులు కురిపించింది. ఆత్రేయపురం మండలం బొబ్బర్లంకలో ఆదివారం లభించిన ఆ పులసను రావులపాలెం విందు రెస్టారెంట్‌ యజమాని గొలుగూరి సత్యశ్రీనివాసరెడ్డి కొనుగోలు చేశారు. తమ హోటల్‌లో కస్టమర్ల కోసం కొన్న పులసల్లో ఈ భారీ పులస కూడా ఉందని, దీనిని రూ.7 వేలకు కొన్నానని ఆయన తెలిపారు. రెండున్నర కిలోల పులస పులుసుగా మారేలోగా చూసిన వారిని ఆశ్చర్యపరిచింది.
మరిన్ని వార్తలు