‘ఆప్‌’ ఎమ్మెల్యే సోమ్‌నాథ్‌ భారతీకి రెండేళ్ల జైలు

24 Jan, 2021 07:11 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) ఎమ్మెల్యే, ఢిల్లీ మాజీ మంత్రి సోమ్‌నాథ్‌ భారతీకి ఢిల్లీ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. 2016లో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్‌) సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేయడంతోపాటు ఆసుపత్రి ఆస్తికి నష్టం కలిగించినట్లు నిర్ధారణ కావడంతో ఈ మేరకు శిక్ష విధిస్తున్నట్లు అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ రవీంద్ర పాండే శనివారం స్పష్టం చేశారు. రూ.లక్ష జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించారు. సోమ్‌నాథ్‌ భారతీకి న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది. హైకోర్టులో అప్పీల్‌ దాఖలు చేసుకోవచ్చని పేర్కొంది.

2016 సెప్టెంబర్‌ 9న సోమ్‌నాథ్‌ భారతీ మరో 300 మందితో కలిసి ఎయిమ్స్‌ ప్రహరీ గోడపై ఉన్న ఫెన్సింగ్‌ను ధ్వంసం చేసినట్లు కేసు నమోదయ్యింది. అంతేకాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించిన సెక్యూరిటీ సిబ్బందిపైనా దాడి చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. గతంలో 2014లో అర్ధరాత్రి సమయంలో ఓ ఆఫ్రికా మహిళపై దాడి చేసినట్లు ఆరోపణలున్నాయి.

మరిన్ని వార్తలు