బీజేపీ తుడిచి పెట్టుకుపోవడం ఖాయం : వర్ల రామయ్య

30 Jul, 2016 22:39 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న రామయ్య
చిత్తూరు: రాష్ట్రంలో బీజేపీ తుడిచి పెట్టుకుపోవడం ఖాయమని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య స్పష్టం చేశారు. శనివారం చిత్తూరులో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ నాయకులు రాష్ట్ర ప్రజల ఉసురుపోసుకుంటున్నారని ధ్వజమెత్తారు. నిధుల కేటాయింపు, హోదా విషయంలో కేంద్ర మంత్రి అరుణ్‌జెట్లీ రాష్ట్ర ప్రజలను అవమానపరచారని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్ర విభజన సమయంలో బీజేపీ వ్యతిరేకంగా ఉంటూ ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రానికి న్యాయం చేయలేక పోతుందని మండిపడ్డారు. రాష్ట్రంలో తమ పార్టీకి మనుగడ ఉండదని బీజేపీ నాయకులకు తెలిసిపోయిందన్నారు. ఈ కారణంగానే బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంపై కన్నెత్తి చూడటంలేదని దుయ్యబెట్టారు. రాష్ట్ర విభజనలో చట్టంలో ఉన్న అంశాలపై రోజుకో మాట మారుస్తున్నారని వెంకయ్యనాయుడిపై విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రజల ఉసురుపోసుకుంటూ పోలవరం, పింఛన్లు, గృహ నిర్మాణాలకు కేంద్రం ఒక్క పైసా ఇవ్వాన్ని పరిస్థితి అని ఆరోపించారు. చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు  ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి  నిరంతరం పోరాడుతున్నారని, ఇందుకు ఆయన ఆందోళనలో పడి మానసికంగా ఇబ్బంది పడుతున్నారన్నారు. ఎంపీ శివప్రసాద్‌ మాట్లాడుతూ చంద్రబాబును అవమానిస్తే ఊరుకోమని, పార్లమెంట్‌లో ప్రధానమంత్రి మోడీని నిలబడుతామన్నామన్నారు. ప్రత్యేక హోదా విషయంలో ప్రధానమంత్రి సమయం కావాలని కోరుతున్నారని, ఈ కారణంగానే మౌనంగా ఉన్నామని తెలిపారు. 
 
మరిన్ని వార్తలు