ఫేస్‌ బుక్‌ పరిచయంతో మోసపోయాను

4 Aug, 2016 09:58 IST|Sakshi
ఫేస్‌ బుక్‌ పరిచయంతో మోసపోయాను

► సేవా కార్యక్రమాలకు రూ.50 లక్షలు విరాళం ఇస్తానంటే నమ్మి రూ.7 లక్షలు ఖాతాలో వేశాను
► ప్రభుత్వం, దాతలు ఆదుకోకుంటే ఆత్మహత్యే శరణ్యం
► బాధితురాలి ఆవేదన

పాలకుర్తి:  అమెరికాకు చెందిన వ్యక్తి చేతిలో తాను మోసపోయానని  పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన అనంతోజు రజిత ఆవేదన వ్యక్తం చేసింది. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ తాను చేస్తున్న సేవా కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలను ఫేస్‌బుక్‌లో పోస్టు చేయగా.. ఆ ఫొటోలు, వివరాలు చూసిన అమెరికాకు చెందిన టోని మార్క్ అనే వ్యక్తి స్పందించి సేవా కార్యక్రమాలు బాగున్నాయంటూ పరిచయం చేసుకున్నాడని చెప్పింది.

తాను ఏర్పాటు చేయదలుచుకున్న అనాథ శరణాలయం కోసం విరాళం ఇస్తామని చెబితే నమ్మానని తెలిపింది. ముందుగా తనకు అత్యవసరంగా రూ.7 లక్షలు అవసరం ఉన్నాయని టోని మార్కు చెబితే నమ్మి అతను ఇచ్చిన అకౌంట్‌లో వేసి.. అతడి మోసానికి బలయ్యానని చెప్పింది. స్నేహితులు, బంధువుల దగ్గర అప్పులు తెచ్చి ఇచ్చానని రజిత తెలిపింది. తన పరిస్థితి అర్ధం చేసుకుని దాతలు, ప్రభుత్వం ఆదుకోవాలని, లేకుంటే తనకు ఆత్మహత్యే శరణ్యమని పేర్కొంది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదని చెప్పింది.   

మరిన్ని వార్తలు