కారులలో గంజాయ్‌

18 Jul, 2017 00:01 IST|Sakshi
  • మోతుగూడెంలో 200 కిలోలు స్వాధీనం
  • దీని విలువ రూ.10 లక్షలు
  • ఇప్పనపాడులో 161 కిలోలు..
  • విలువ రూ.8.05 లక్షలు
  • రెండు కేసుల్లో ఆరుగురి అరెస్ట్‌ 
  • మూడు కారులు స్వాధీన
  •  
    ఇంతవరకూ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలోనే అత్యంత రహస్యంగా తరలించే గంజాయి.. ఇప్పుడు మైదాన ప్రాంతాల్లో యథేచ్ఛగా రవాణా అయిపోతోంది. అడిషనల్‌ ఎస్పీ దామోదరం ఇచ్చిన సమాచారంతోనే మండపేట పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకోవడం విశేషం. జిల్లాలో సోమవారం రెండు సంఘటనల్లో రూ.18.05 లక్షల విలువ జేసే 261 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు కేసుల్లో ఆరుగురిని అరెస్ట్‌ చేసి, గంజాయి రవాణా చేస్తున్న వాహనాలను సీజ్‌ చేశారు. ఏలేశ్వరం మండలంలోని చిన్నింపేటలో హైవేపై ప్రమాదానికి గురైన కారులోంచి గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే కేసు వివరాలను మాత్రం అక్కడి పోలీసులు వెల్లడించలేదు. నిందితులు కారు విడిచి వెళ్లపోవడంతో అక్కడ అరెస్ట్‌లు చోటుచేసుకులేదు. ఈ కేసుల్లో అరెస్ట్‌ అయిన నిందితులు..ఈ కేసులోకేవలం పొట్ట కూటి కోసమే గంజాయి రవాణా చేస్తున్నారా? లేక వారి వెనుక పెద్దల హస్తాలు ఉన్నాయా? అనేది పోలీసులే తేల్చాల్సిఉంది. గంజాయి రవాణా క్రమేపీ పెరిగిపోతున్నందున.. ఈ విషయంలో పోలీసులు ఒత్తిడులకు లొంగిపోతే.. భవిష్యత్తులో పెను ముప్పు తప్పకపోవచ్చు.
     
    మోతుగూడెం (రంపచోడవరం) : విశాఖ జిల్లా సీలేరు నుంచి తెలంగాణలోని వరంగల్‌ జిల్లాకు అక్రమంగా తరలిస్తున్న రూ. 10 లక్షల విలువైన 200 కిలోల గంజాయిని సోమవారం సాయంత్రం జెన్‌కో చెక్‌పోస్టు వద్ద మోతుగూడెం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చింతూరు సీఐ కె.దుర్గాప్రసాద్, ఎస్సై వి.కిషోర్‌ ఈ వివరాలను విలేకరులకు తెలిపారు. విశాఖ జిల్లా సీలేరు ప్రాంతం నుంచి మోతుగూడెం మీదుగా గంజాయి అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారం మేరకు సాయంత్రం మోతుగూడెం జెన్‌కో చెక్‌పోస్టు వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. సీలేరు వైపు నుంచి వస్తున్న ఏపీ 36 ఏఎస్‌ 3951 నెంబరు కారును క్షుణ్ణంగా తనిఖీ చేయగా 200 కిలోల గంజాయి బయటపడింది. దాని విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందని సీఐ తెలిపారు. గంజాయిని తరలిస్తున్న వరంగల్‌ జిల్లాకు చెందిన చింతల గంగరాజు, మహబూబుబాద్‌ జిల్లాకు బానోతు సుమన్‌లను అరెస్ట్‌ చేశారు. పట్టుబడిన గంజాయిని ఎమ్మార్వో తేజేశ్వరరావు సమక్షంలో స్వాధీనం చేసుకొని, కారును సీజ్‌ చేసినట్టు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి రంపచోడవరం కోర్టుకు తరలిస్తామని సీఐ తెలిపారు.
     
    మండపేటలో 161 కేజీలు స్వాధీనం 
    ఇప్పనపాడు (మండపేట) : మండలంలోని వేములపల్లి మీదుగా తరలిస్తున్న 161 కిలోల గంజాయిని  మండపేట రూరల్‌ పోలీసులు స్వాధీనం చేసుకుని నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. దీని విలువ సుమారు రూ.8.05 లక్షలు ఉంటుందని తెలిపారు. గంజాయిని తరలిస్తున్న వాహనాన్ని సీజ్‌ చేశారు. ఈ కేసు వివరాలను రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో రామచంద్రపురం డీఎస్పీ ఎంబీఎం మురళీకృష్ణ విలేకరులకు వివరించారు. ద్వారపూడి శివారు వేములపల్లి మీదుగా ఆదివారం రాత్రి గంజాయి రవాణ చేస్తున్నట్టు అడిషనల్‌ ఎస్పీ ఏఆర్‌ దామోదరం సమాచారం ఇచ్చారన్నారు. దీంతో ఇందిరమ్మ కాలనీ సమీపంలోని తుంగపాడు రూరల్‌ సీఐ కోనాల లక్ష్మణరెడ్డి, తహసీల్దార్‌ మేకా వెంకటేశ్వర్లు, ఎస్సై శివప్రసాద్‌ సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేశారు. మహేంద్ర కంపెనీకి చెందిన కారును తనిఖీ చేస్తుండగా సీట్లు కింద ఉంచిన 161 కిలోల గంజాయి లభ్యమైంది. మొత్తం 69 ప్యాకెట్లలో ఈ గంజాయిని పార్శిల్‌ చేశారు. రంగంపేట మండలం సుబద్రంపేటకు చెందిన యాళ్ల భాస్కరరావు, అతని అనుచరులు కేతా నాగేశ్వరరావు, బక్కా సురేష్, రాజమహేంద్రవరం పేపర్‌మిల్లు సమీపంలోని ఆర్‌అండ్‌బీ కాలనీకి చెందిన డ్రైవర్‌ బి.సూర్యకనకరాజులను అదుపులోకి తీసుకున్నారు. వీరు గతంలో గంజాయి తరలిస్తు పట్టుబడిన వారుగా గుర్తించారు. ఏజెన్సీ పరిధిలోని లంబసంగి, చింతూరు తదితర గ్రామాల నుంచి గంజాయిని ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నట్టు గుర్తించారు.  
     
    ముంబాయికి ఎగుమతి :
    ఏజెన్సీలో సేకరించిన గంజాయిని హైదరాబాద్‌ మీదుగా ముంబాయికి తరలిస్తుంటారని పోలీసులు గుర్తించారు. ఏజెన్సీలో కిలో గంజాయిని రూ.5 వేలకు కొనుగోలు చేసి ముంబాయి వ్యాపారులకు రూ. 10 వేలకు విక్రయిస్తారని డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. ముంబాయికి చేరగానే దీని ఖరీదు రూ.లక్షల్లోకి చేరుతుందన్నారు. గంజాయిని ఏజెన్సీలో ఎక్కడ కొనుగోలు చేసింది, హైదరాబాద్‌లో ఎవరికి విక్రయిస్తుంది విచారిస్తున్నామన్నారు. నిందితులను ఆలమూరు కోర్టులో హాజరుపర్చనున్నట్టు తెలిపారు. గంజాయి రవాణాను అడ్డుకున్న సీఐ లక్ష్మణరెడ్డి, ఎస్సై శివప్రసాద్, రూరల్‌ పోలీసులను డీఎస్పీ మురళీకృష్ణ అభినందించారు.
     
     
    అగిపోయిన కారులో..
    ఏలేశ్వరం (ప్రత్తిపాడు) : మండలంలోని చిన్నింపేట జాతీయ రహదారిపై సోమవారం కారులో తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుపడిన గంజాయి వివరాలు దర్యాప్తులో తేలాల్సి ఉందని పోలీసులు తెలిపారు. వారి కథనం ప్రకారం వైజాగ్‌ నుంచి రాజమండ్రి వైపు వెళుతున్న కారు అదుపు తప్పి హైవేలోని వేగ నిరోధకాన్ని ఢీకొంది. దీంతో ఎంతకీ స్టార్ట్‌ కాకపోవడంతో కారును నిందితులు వదిలి వెళ్లిపోయారు. స్థానికుల సమాచారం పోలీసులు కారును పరిశీలించిగా ఢిక్కీలో గంజాయి ఉన్నట్టు గుర్తించారు. దీంతో కారును పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈమేరకు ఎస్సై ఎం.అప్పలనాయుడు కేసు దర్యాప్తు ప్రారంభించారు. 
     
మరిన్ని వార్తలు