కాటేసిన విద్యుత్‌ తీగలు

15 Mar, 2017 23:44 IST|Sakshi

తనకల్లు (కదిరి) : పంట కోసం ఏర్పాటు చేసిన విద్యుత్‌ తీగలు తగిలి సోమశేఖర్‌రెడ్డి (35) అనే వ్యవసాయ కూలీ బుధవారం మృతి చెందిన సంఘటన తనకల్లు మండలం తురకవాండ్లపల్లి వద్ద జరిగింది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన రాజశేఖర్‌బాబు అనే రైతుకు చెందిన పొలంలో సోమశేఖర్‌రెడ్డి కూలీగా పని చేస్తున్నాడు. పొలంలో సాగు చేసిన బెండ పంటకు క్రిమిసంహారక మందు కొట్టేందుకు వెళ్లాడు.

అంతకు ముందే అడవిపందుల బారినుండి పంటను కాపాడేందుకు పొలం చూట్టూ కంచె వేసి విద్యుత్‌ సరఫరా పెట్టారు. అయితే ప్రమాదవశాత్తు సొమశేఖర్‌ విద్యుత్‌ తీగలకు తగలడంతో కిందపడిపోయాడు. గమనించిన గ్రామస్తులు అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు యత్నించగా అప్పటికే మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు