గ్రాఫిక్స్‌తో మభ్యపెడుతున్న సీఎం

21 Sep, 2017 22:07 IST|Sakshi
గ్రాఫిక్స్‌తో మభ్యపెడుతున్న సీఎం

మడకశిర: రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గ్రాఫిక్స్‌తో మభ్యపెడుతున్నారని పీసీసీ చీఫ్‌ ఎన్‌.రఘువీరారెడ్డి అన్నారు. గురువారం అనంతపురం జిల్లా నీలకంఠాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజధాని నిర్మాణంలో దర్శకుడు రాజమౌళి, నిపుణులు గ్రాఫిక్స్‌ చేసినంత మాత్రాన రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదన్నారు. అదేవిధంగా సీఎం దత్తత తీసుకున్న అరకు ప్రాంతం 172వ స్థానంలో నిలిచిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే ఇందుకు కారణమన్నారు.

అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉండగా.. 12 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను ఎమ్మెల్యేలు గెలిపిస్తే రాష్ట్ర స్థూల ఆదాయంలో 13వ స్థానంలో నిలిపారన్నారు. 175 నియోజకవర్గాల తలసరి ఆదాయంలో అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం 174వ స్థానంలో ఉందన్నారు. అదేవిధంగా అవగాహన లేని జీఎస్టీ, నోట్ల రద్దువల్ల దేశంలో ఆర్థికవ్యవస్థ పూర్తిగా కుదేలైందన్నారు. ప్రభుత్వానికి స్పష్టమైన ప్రణాళిక లేకపోవడంతోనే వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధిలో వెనుకబడ్డాయన్నారు.

మరిన్ని వార్తలు