విద్య, వైద్యం బాగుంటేనే దేశాభివృద్ధి

6 Jul, 2017 21:48 IST|Sakshi
విద్య, వైద్యం బాగుంటేనే దేశాభివృద్ధి

కదిరి అర్బన్‌ : విద్య,వైద్యం బాగుంటేనే దేశాభివృద్ధి వేగంగా జరుగుతుందని రాయలసీమ రీజియన్‌ ఐజీ షేక్‌ మహ్మద్‌ ఇక్బాల్‌ పేర్కొన్నారు. మున్సిపల్‌ పరిధిలోని కుటాగుళ్ల మున్సిపల్‌ ఉన్నత పాఠశాల, పట్టణంలోని ఉర్దూ, జెడ్పీ ఉన్నత పాఠశాలల విద్యార్థులతో గురువారం ఆయన ముఖాముఖిగా మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం,విద్య కలిగి ఉంటే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక కార్యక్రమాలు చేపట్టాలన్నారు. తన తండ్రి ఒక స్కూల్‌ టీచర్‌ అని అయన స్ఫూర్తితో పాఠశాల విద్యార్థులకు ఎంతో కొంత సాయం చేయాలని ఇక్కడికి వచ్చానన్నారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడించారు.

వారిలో బాగా మాట్లాడిన లతేశ్వరీ అనే 10వ తరగతి విద్యార్థిని పుష్కగుచ్ఛం అందజేసి అభినందించారు. అంతకు మునుపు ఎమ్యెల్యే అత్తార్‌చాంద్‌బాషా,మున్సిపల్‌ చైర్మన్‌ సురయాభాను,కమీషనర్‌ భవాని ప్రసాద్,రాష్ట్ర మహిళా కమీషన్‌ మెంబర్‌ పర్విన్‌బాను తదితరులు మాట్లాడారు. అనంతరం కెరీర్‌ ఫౌండేషన్‌ పుస్తకాలను పంపిణీ చేశారు.అక్కడి నుంచి నేరుగా పట్టణంలోని ఉర్దూ మున్సిపల్‌ హైస్కూల్‌కు వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. వారు ఏర్పాటు చేసిన విజ్ఞానశాస్త్ర ప్రదర్శనను తిలకించారు. మధ్యాహ్నం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల కాంపౌండ్‌ ముందు వాహనాల పార్కింగ్‌తో తమకు ఇబ్బంది ఉందని విద్యార్థులు ఐజీ దృష్టికి తీసుకెళ్లగా అక్కడికక్కడే వాహానాలను ఆ ప్రాంతం నుంచి తరలించేలా చర్యలు తీసుకున్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వరప్రసాద్‌రాజు, ఆళియాతో పాటు పలువురు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు