– ఆర్డీఓలు, డీఎస్పీలకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు
కర్నూలు(అగ్రికల్చర్): ఎస్సీ, ఎస్టీ కేసులను జాప్యం లేకుండా సత్వరం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆదేశించారు. బుధవారం తన చాంబరులో ఎస్పీ ఆకె రవికృష్ణ, డీఎస్పీలు, ఆర్డీఓలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అట్రాసిటీ కేసుల విచారణలో బాధితులకు సకాలంలో పరిహారం అందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా మొత్తం మీద 201 కేసులు పెండింగ్లో ఉన్నాయని, వీటిపై పబ్లిక్ ప్రాసిక్యూటర్తో కలసి సమీక్షించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసుల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ వివరించారు. సమావేశంలో జేసీ హరికిరణ్, డీఆర్ఓ గంగాధర్గౌడ్, ఆర్డీఓలు రఘుబాబు, సుధాకర్రెడ్డి, ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.