టీడీపీని ప్రజలు భూస్థాపితం చేశారు

7 Aug, 2016 04:42 IST|Sakshi
మాట్లాడుతున్న టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు శివకుమార్‌
–టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు శివకుమార్‌
పాలమూరు : తెలంగాణలో టీడీపీని ప్రజలు భూస్థాపితం చేశారని, అయినా తెలంగాణ టీడీపీ నాయకుల్లో మార్పు రావడం లేదని టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు శివకుమార్‌ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

చంద్రబాబు ఆలోచన విధానాన్ని తెలంగాణలో అమలు చేస్తున్న టీడీపీ నాయకులు తెలంగాణ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని విమర్శించడం సిగ్గుచేటని అన్నారు. పాలమూరుకు ప్రాజెక్టులు రాకుండా అడ్డుకునేందుకు చంద్రబాబు వేస్తున్న ఎత్తుగడలో భాగంగానే టీడీపీ నాయకులు అనవసర ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. పాలమూరుకు నీళ్లు రావాలనే ఆలోచనా చంద్రబాబుకు ఉంటే బహిరంగంగా చెప్పాలని సవాలు చేశారు. రైతు ఆత్మహత్యలకు ప్రధాన కారణంగా 60ఏళ్లు అధికారంలో ఉన్న టీడీపీ, కాంగ్రెస్‌లేనని ఆరోపించారు. విడతల వారిగా రైతులకు రుణమాఫీ అమలు చేస్తున్నామని అన్నారు. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రాజెక్టుల కోసం ఎన్ని డబ్బులు ఖర్చు చేశారో టీడీపీ నాయకులు, రావుల చంద్రశేఖర్‌రెడ్డి బహిర్గతం చేయాలని అన్నారు. అంతకు ముందు జయశంకర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఈజీఎస్‌ రాష్ట్ర డైరెక్టర్‌ కోట్ల కిశోర్‌రెడ్డి, జిల్లా కో కన్వీనర్‌ బెక్కెం జనార్దన్‌ మాట్లాడుతూ తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్‌ జయశంకర్‌ అని, ఆయన ఆశయాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో కోఆప్షన్‌ మెంబర్‌ మహమూద్, రవి, గౌతమ్‌శ్రీను తదితరులు పాల్గొన్నారు. 
 
 
మరిన్ని వార్తలు