'లంచం, మంచం తీసుకుని తిప్పించుకుంటావా?'

19 Sep, 2015 15:51 IST|Sakshi

కారేపల్లి (ఖమ్మం) : 'పట్టాదారు పాస్‌ పుస్తకాలు ఇవ్వడం కోసం లంచం, మంచం తీసుకుని రేపు, మాపు అంటూ తిప్పించుకుంటావా?' అని ప్రశ్నించిన రైతుపై ఓ వీఆర్వో చేయిచేసుకున్నాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో శనివారం జరిగింది. బాధితుడి కథనం మేరకు... మండలంలోని మాదారం గ్రామానికి చెందిన రైతు గగులోతు మన్సూర్‌కు పది ఎకరాల పొలం ఉంది. దానికి పట్టాదారు పాస్‌పుస్తకం కావాలని అతడు దరఖాస్తు చేసుకున్నాడు. పాస్‌పుస్తకాలు ఇచ్చేందుకు గాను వీఆర్వో సురేందర్ రైతు నుంచి రూ.40వేలు లంచంతోపాటు ఓ డబుల్‌కాట్ మంచం కూడా తీసుకున్నాడు.

అయితే పాస్‌పుస్తకాలు ఇవ్వకుండా ఐదు నెలలుగా తిప్పించుకుంటుండటంతో మన్సూర్ విసుగెత్తిపోయాడు. శనివారం తహశీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుని వీఆర్వో సురేందర్‌ను నిలదీశాడు. దీంతో తననే నిలదీస్తావా అంటూ రైతుపై వీఆర్వో దాడి చేశాడు. రెండు చెంపలూ వాయించేశాడు. దీంతో అక్కడున్న రైతులు తిరగబడగా అతడు తహశీల్దార్ చాంబర్‌లోకి వెళ్లిపోయాడు. అనంతరం బాధిత రైతు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వీఆర్వోపై ఫిర్యాదు చేశాడు.

మరిన్ని వార్తలు