ఏలూరు (ఆర్ఆర్ పేట) : జిల్లాలో సాగు, తాగునీటి కష్టాలను అధిగమించేందుకు ఫామ్ పాండ్స్, ఇంకుడుగుంతలు విరివిగా ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. సోమవారం ‘మీ కోసం’ కార్యక్రమం సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరించి వాటి సత్వర పరిష్కారానికి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితుల వల్ల భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయని ప్రతి నీటి చుక్కనూ భూమిలోకి ఇంకే విధంగా రైతులు, ప్రజలు ఇంకుడుగుంతలు, ఫామ్పాండ్స్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఫామ్ పాండ్స్ ఏర్పాటు చేసుకోవడం వల్ల రైతులకు సాగునీటికి ఇబ్బందులు లేకుండా నీటిని నిల్వ చేసుకోవచ్చునని చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను కలెక్టర్కు విన్నవించారు.
∙పెదవేగి మండలంలోని గార్లమడుగు, పెదవేగి, కొప్పులవారిగూడెం, న్యాయంపల్లి, కూచింపూడి, రాట్నాలకుంట, రాయుడుపాలెం, జగన్నాథపురం గ్రామాల్లో తాగునీరు, సాగునీరు బోర్లు ఎండిపోయి తీవ్రమైన నీటి ఎద్దడి ఏర ్పడిందని పెదవేగి కోపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు ఉండవల్లి వెంకటరమణ, రాట్నాలకుంట ఆలయ చైర్మన్ రాయుడు విజయ వెంకట భాస్కరరావు, ఏఎంసీ చైర్మన్ ఎం.శ్రీనివాసచౌదరి కలెక్టరు దృష్టికి తీసుకువచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ రైతులు ఫామ్ పాండ్స్ ఏర్పాటు చేసుకోవడానికి నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులు వారి పొలాల్లో స్వచ్చందంగా ఇప్పటికైనా ఫామ్ పౌండ్స్ నిర్మించుకోవాలన్నారు.
∙తాడేపల్లిగూడెం మండలం కొమ్ముగూడెం గ్రామం, నిడదవోలు మండలం కోరుమామిడి, నడుపల్లి గ్రామాలకు చెందిన రైతులు కె.శ్రీనివాసరావు, చుండ్రు సతీష్, ముళ్ళపూడి సుబ్బారావు తదితరులు కలెక్టర్కు వినతిపత్రం సమర్పిస్తూ తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెం నుంచి నందమూరు వరకు 3.3 కిలోమీటర్లు పొడవునా ఎర్రకాలువ కుడి, ఎడమ గట్ల పటిష్టం చేసే పనులు మధ్యలో వదిలేశారని, దీంతో తమ భూములు మురుగునీటితో ముంపునకు గురవుతున్నాయని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. జేసీ పి.కోటేశ్వరరావు, అదనపు జేసీ ఎంహెచ్.షరీఫ్, డీఆర్వో కె.ప్రభాకరరావు, డ్వామా పీడీ టి.వెంకటరమణ, వికలాంగు సంక్షేమ శాఖ డీడీ ప్రసాదరావు, డీఈవో డి.మధుసూదనరావు, హౌసింగ్ పీడీ శ్రీనివాసరావు, హార్టీకల్చర్ ఏడీ విజయలక్ష్మి, డీఎంహెచ్వో డాక్టర్ కె.కోటేశ్వరి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సీహెచ్ అమరేశ్వరరావు పాల్గొన్నారు.
అవినీతిరహిత పాలనకు ముందుకురావాలి
జిల్లాలో అవినీతిర హిత పాలన అందించడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కలెక్టర్ భాస్కర్ పిలుపునిచ్చారు. సోమవారం జిల్లాస్థాయి అధికారుల సంప్రదింపుల కమిటీ సమావేశంలో మాట్లాడుతూ జిల్లా ట్రెజరీ కార్యాలయం నుంచి అవినీతి ప్రారంభమవుతోందని, జీపీఎఫ్ సొమ్ము పొందాలన్నా, టీఏ బిల్లులు ఆమోదం పొందాలన్నా ఇబ్బందులు పెడుతున్నారని, దీనిపై ఉపేక్షించేది లేదని కఠిన చర్యలు తీసుకుంటానన్నారు. ఈ–ఫైలింగ్లో కూడా కొంతమేర అవినీతి జరుగుతుందని, పూర్తిస్థాయిలో పారదర్శకపాలన అందించేందుకు నూతన విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు.