కడియం (రాజమహేంద్రవరం రూరల్): ప్రశ్నించే హక్కు అందరికీ ఉంటుందని, ఆ హక్కును హరించడం సరికాదని సినీ విమర్శకుడు కత్తి మహేష్ అన్నారు. బాబు గోగినేని ఫేస్బుక్ ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆదివారం ఆయన స్థానిక పల్ల వెంకన్న నర్సరీకి వచ్చారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. పవన్ అభిమానులు తనపై అన్ని రకాల దాడులకూ దిగారని, అయినా తాను వెనకడుగు వేయలేదని చెప్పారు. అభిమానులకు పవన్ సూచనలు ఇచ్చినందువల్లే వివాదం సద్దుమణిగిందని తెలిపారు. పండుగల సమయంలో ప్రజాధనంతో ప్రభుత్వాలు ఇచ్చే చంద్రన్న కానుకల వంటివి దండగని కత్తి మహేష్ అభిప్రాయపడ్డారు. కులాలు, మతాల ప్రస్తావన లేకుండా మానవతావాదులుగా ఉండేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందన్నారు.