డిగ్రీ తర్వాత.. పయనమెటు?

26 Jun, 2014 03:16 IST|Sakshi
డిగ్రీ తర్వాత.. పయనమెటు?

అండర్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో బీఎస్సీ, బీఏ, బీకామ్ వంటి సంప్రదాయ గ్రూప్‌లతో డిగ్రీ పూర్తిచేసిన వారు ఆయా డిగ్రీలలోని గ్రూప్ సబ్జెక్టులు లేదా అనుబంధ సబ్జెక్టులలో పోస్టు గ్రాడ్యుయేషన్ చేయొచ్చు. ప్రస్తుతం పీజీలో సంప్రదాయ సబ్జెక్టులతో పాటు జాబ్ మార్కెట్‌కు అనుగుణంగా వినూత్న స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు ఎంఎస్సీ అగ్రికల్చర్ బయోటెక్నాలజీ, ఎంఎస్సీ హ్యూమన్ జెనెటిక్స్, ఎంఎస్సీ కోస్టల్ ఆక్వాకల్చర్ అండ్ మెరైన్ బయోటెక్నాలజీ, ఎంఎస్సీ ఫిజికల్ ఓషనోగ్రఫీ వంటి కోర్సులను చెప్పుకోవచ్చు.
 
 ఇంకా సెన్సైస్ అభ్యర్థులకు.. కెమిస్ట్రీ (ఇన్‌ఆర్గానిక్/ఆర్గానిక్/ఫిజికల్ ఆర్గానిక్/ఫార్మాస్యూటికల్/ ఫార్మకోఇన్ఫర్మాటిక్స్), అప్లైడ్ మ్యాథమెటిక్స్, జెనెటిక్స్, మైక్రోబయాలజీ, ఫిషరీస్, ఫారెస్ట్రీ, అప్లైడ్ న్యూట్రిషన్, బయోకెమిస్ట్రీ, కంప్యూటర్ అప్లికేషన్స్, బయోఫిజిక్స్, బయోటెక్నాలజీ, బయోఇన్ఫర్మాటిక్స్, ఫోరెన్సిక్ సైన్స్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, జియోఫిజిక్స్, ఆస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, అప్లైడ్ జియోకెమిస్ట్రీ, నానోసైన్స్ తదితరాలు ఉన్నాయి.
 
 సోషల్ సెన్సైస్ అభ్యర్థులు ఎంఏలో సంప్రదాయ ఆప్షన్లతో పాటు ఆంత్రోపాలజీ, డెవలప్‌మెంట్ స్టడీస్, లింగ్విస్టిక్స్, ఆర్కియాలజీ, సోషియాలజీ, సోషల్‌వర్క్, సైకాలజీ వంటి సబ్జెక్ట్‌లను ఎంపిక చేసుకోవచ్చు.ఎంకామ్‌లో.. ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఫైనాన్స్ అండ్ కంట్రోల్, కార్పొరేట్ సెక్రటరీషిప్, ఫైనాన్స్ మేనేజ్‌మెంట్, మాస్టర్ ఆఫ్ ఫైనాన్స్ మేనేజ్‌మెంట్, ఫైనాన్స్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్ వంటివి ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని యూనివర్సిటీలతో పాటు సెంట్రల్ యూనివర్సిటీలు, జేఎన్‌యూ-న్యూఢిల్లీ వంటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు అన్ని రకాల ఆప్షన్స్‌తో పీజీ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి.
 
 ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ
 సైన్స్ అభ్యర్థులు డిగ్రీ అర్హతతో ఎంఎస్సీతోపాటు పీహెచ్‌డీ చేసే అవకాశాన్ని కొన్ని కోర్సులు కల్పిస్తున్నాయి. ఈ కోర్సులను ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీలుగా వ్యవహరిస్తారు. ప్రఖ్యాత ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్- బెంగళూరు, బయలాజికల్ సైన్స్, కెమికల్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ విభాగాల్లో ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ కోర్సులను ఆఫర్ చేస్తుంది. జవహర్‌లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ సైంటిఫిక్ రీసెర్చ్- బెంగళూరు బయలాజికల్ సైన్స్, కెమికల్ సెన్సైస్‌లో ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ కోర్సులను ఆఫర్ చేస్తుంది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్.. ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ- పీహెచ్‌డీ (ఫిజిక్స్, ఆస్ట్రోఫిజిక్స్) కోర్సును ఇగ్నో సహకారంతో నిర్వహిస్తోంది.
 
 
 గ్రాడ్యుయేషన్ తర్వాత పీజీకే పరిమితం కాకుండా విద్యార్థులు పరిశోధనల వైపు దృష్టి సారిస్తే కెరీర్‌లో ఉన్నతంగా స్థిరపడవచ్చు. ఈ క్రమంలో పీజీ తర్వాత యూజీసీ-నెట్, సీఎస్‌ఐఆర్-నెట్ ద్వారా పీహెచ్‌డీ చేయొచ్చు. ఐఐటీ వంటి ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌లలో పరిశోధన కోర్సుల్లో చేరడానికి పరిగణించే అర్హతల్లో నెట్/జేఆర్‌ఎఫ్ అభ్యర్థులకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తారు. సోషల్ సెన్సైస్ అభ్యర్థులకు కేవలం నెట్ ద్వారానే కాకుండా పరిశోధన కోర్సుల్లో చేరే అవకాశాన్ని కొన్ని ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లు కల్పిస్తున్నాయి. అవి.. టిస్, సీఎస్‌డీఎస్, తదితరాలు. అభ్యర్థులు పంపించిన ప్రాజెక్ట్ ప్రతిపాదనల ఆధారంగా ఆయా ఇన్‌స్టిట్యూట్‌లు ప్రవేశం కల్పిస్తున్నాయి.
 
 మేనేజ్‌మెంట్ దిశగా అడుగులు
 డిగ్రీ తర్వాత మేనేజ్‌మెంట్ కెరీర్ వైపు దృష్టి సారించాలనుకుంటే ఎంబీఏ కోర్సును ఎంచుకోవచ్చు. ఇందుకోసం రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ఐసెట్ లేదా జాతీయ స్థాయిలో నిర్వహించే క్యాట్, మ్యాట్, సీమ్యాట్, ఎక్స్‌ఏటీ వంటి పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. టెక్నికల్ వైపు ఆసక్తి ఉంటే ఎంసీఏ కోర్సును ఎంచుకోవచ్చు. ఇందుకోసం కూడా ఐసెట్ (ఇంటర్మీడియెట్ వరకు మ్యాథమెటిక్స్ చదివిన అభ్యర్థులు మాత్రమే ఎంసీఏకు అర్హులు) పరీక్ష రాయాలి.
 
 అత్యధిక మంది ఎంపిక టీచింగ్
 సంప్రదాయ డిగ్రీ కోర్సుల తర్వాత అత్యధిక మంది విద్యార్థులు టీచింగ్ కోర్సులను ఎంచుకుంటున్నారు. ఈ విభాగంలో డిగ్రీ తర్వాత బీఈడీ (బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్) కోర్సు అందుబాటులో ఉంది. ఈ కోర్సులో ప్రవేశానికి ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(ఎడ్‌సెట్) రాయాలి. ఫిజికల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఈడీ) కోర్సు అందుబాటులో ఉంది. తెలుగు, హిందీ వంటి లాంగ్వేజ్ సబ్జెక్టులను బోధించడానికి కొన్ని ప్రత్యేక స్కిల్స్ ఉండాలి. అటువంటి స్కిల్స్‌ను పెంపొందించడానికి ఉద్దేశించినవి లాంగ్వేజ్ పండిట్ కోర్సులు.
 
  వీటిల్లో ప్రవేశానికి లాంగ్వేజ్ పండిట్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(ఎల్‌పీసెట్) రాయాలి. మానసిక, శారీరక వైకల్యాలతో బాధపడుతూ, సాధారణ పిల్లలతో సమానంగా పోటీ పడలేని చిన్నారులకు అవసరమయ్యే బోధనా పద్ధతుల్లో శిక్షణ ఇచ్చేదే స్పెషల్ ఎడ్యుకేషన్. రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పరిధిలోని పలు ఇన్‌స్టిట్యూట్‌లు ఈ విభాగంలో బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) కోర్సును అందిస్తున్నాయి. ఈ కోర్సు పూర్తిచేసిన వారికి పాఠశాలలు, సర్వశిక్షా అభియాన్ పరిధిలోని పాఠశాలల్లో టీచర్‌గా, రిహాబిలిటేషన్ సెంటర్లలో ఎడ్యుకేషన్ ఇన్‌స్ట్రక్టర్‌గా, రెగ్యులర్ ప్రీస్కూళ్లు, వివిధ పాఠశాలల్లో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా సేవలందించవచ్చు.
 
 లా కోర్సులు
 న్యాయవాద వృత్తిపై ఆసక్తి ఉంటే లా కోర్సులను ఎంచుకోవచ్చు. ఇందుకోసం రాష్ట్ర స్థాయిలో లాసెట్ (లా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్)కు హాజరు కావచ్చు. అంతేకాకుండా జాతీయ స్థాయిలో కామన్ లా అడ్మిషన్ టెస్ట్(క్లాట్), ఏఐఎల్‌ఈటీ (ఆల్ ఇండియా లా ఎంట్రెన్స్ టెస్ట్), లా స్కూల్ అడ్మిషన్ టెస్ట్ ఇండియా(ఎల్‌శాట్) తదితర ప్రవేశ పరీక్షలకు హాజరు కావచ్చు.
 
 జర్నలిజం
 భారతదేశంలో మీడియాలోకి విదేశీ పెట్టుబడులను కేంద్రం అనుమతిస్తుండడంతో ఈ రంగంలోకి అనేక సంస్థలు ప్రవేశిస్తున్నాయి. దీంతో మీడియా రంగంలో అవకాశాలు కోకొల్లలు అని చెప్పొచ్చు. మీడియా మాస్ కమ్యూనికేషన్ అంటే ఒక్క ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియానే కాదు... ఇంకా సినిమాలు, అడ్వర్టైజింగ్, డిజిటల్ మీడియా, రేడియోలు, పరిశ్రమలు, సంస్థల్లో పబ్లిక్ రిలేషన్ విభాగం, ఎడిటింగ్, స్క్రిప్ట్‌రైటింగ్, మ్యాగజైన్స్, వెబ్ జర్నలిజం.. ఇలా అన్నీ వస్తాయి. వీటన్నింటిలో అత్యంత శక్తివంతమైన సాధనాలు పత్రికలు, టీవీలు. అందుకే గత ఐదేళ్లలో భారతదేశంలో టీవీ, పత్రికా రంగాలు గణనీయంగా వృద్ధి చెందాయి.
 
  దేశంలో జర్నలిజంలో శిక్షణ ఇచ్చే ప్రతిష్టాత్మక సంస్థలు ఎన్నో ఉన్నాయి. కొన్ని విశ్వవిద్యాలయాలు జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ పేరుతో రెండేళ్ల కోర్సు నిర్వహిస్తున్నాయి. మీడియాలో పోటీ నెలకొనడంతో నిష్ణాతులైన అభ్యర్థుల కోసం దేశవ్యాప్తంగా అనేక పత్రికలు, ఛానళ్లు సొంతంగా జర్నలిజంలో శిక్షణ ఇస్తూ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. కొన్ని సంస్థలు నేరుగా విశ్వవిద్యాలయాల విద్యార్థులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. మన రాష్ట్రంలో ప్రధాన దినపత్రికలన్నింటికి సొంతంగా జర్నలిజం స్కూళ్లు ఉన్నాయి. వీటిల్లో నియామకాలకు ఖాళీలను బట్టి నోటిఫికేషన్లు విడుదల చేసి అభ్యర్థులను భర్తీ చేసుకుంటాయి.
 
 కొత్త కెరీర్‌లు
 డిగ్రీ విద్యార్థులు ప్రస్తుతం ఆవిర్భవించిన నూతన కెరీర్ వేదికల వైపు దృష్టి సారించడం ద్వారా మెరుగైన అవకాశాలను దక్కించుకోవచ్చు. అటువంటి వాటిలో కొన్ని.. ఫ్యాషన్ డిజైనింగ్, రిటైల్ మార్కెటింగ్, ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్‌మెంట్, హాస్పిటాలిటీ, హోటల్ మేనేజ్‌మెంట్, టూరిజం, ఫార్మా, బయోటెక్నాలజీ, బయోఇన్ఫర్మాటిక్స్, బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ ఆఫర్ చేసే ఫైనాన్షియల్ కోర్సులు, కార్పొరేట్ కమ్యూనికేషన్, ఈవెంట్ మేనేజ్‌మెంట్, బీపీఓ, కెపీఓ, మెడికల్ ట్రాన్స్‌కిప్షన్. వీటికి సంబంధించి ఆయా విభాగాల్లో ఉండే పీజీ లేదా పీజీ డిప్లొమా, స్వల్ప కాలిక వ్యవధితో ఉండే డిప్లొమా కోర్సులను ఎంచుకోవచ్చు. తద్వారా మెరుగైన కెరీర్ దిశగా అడుగులు వేయవచ్చు. అందుకు అనుగుణంగా స్కిల్స్ మెరుగుపర్చుకోవడం తప్పనిసరి.
 
 బాసటగా విదేశీ భాషలు
 ప్రపంచీకరణ వల్ల పారిశ్రామిక రంగంతోపాటు వివిధ రంగాల్లో వస్తున్న మార్పుల కారణంగా విదేశీ భాషల్లో నిష్ణాతులైన అభ్యర్థుల అవసరం పెరుగుతుంది. ముఖ్యంగా నాన్-ఇంగ్లిష్ స్పీకింగ్ దేశాల భాష తెలిసిన వారికి మంచి అవకాశాలు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో.. ఫ్రెంచ్, జర్మనీ, రష్యన్, చైనీస్ భాషలకు బాగా డిమాండ్ ఉంది. ఉస్మానియా, ఇఫ్లూ, జేఎన్‌యూ వంటి యూనివర్సిటీలు ఆఫర్ చేస్తున్న సంబంధిత కోర్సులను అధ్యయనం చేయడం ద్వారా ట్రాన్స్‌లేటర్స్, ఇంటర్‌ప్రిటేటర్, టీచింగ్, ఫ్రీలాన్సింగ్ వంటి రంగాల్లో అవకాశాలను దక్కించుకోవచ్చు.
 
 ఉద్యోగమే లక్ష్యమైతే
 ప్రస్తుతం ప్రభుత్వ రంగానికి సంబంధించి యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ, రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఉద్యోగాల నియామకం కోసం నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నారుు. ఈ పరీక్షల్లో రాణించేందుకు అకెడమిక్స్ చదువుతూనే పోటీ పరీక్షల కోసం సిద్ధంకావాలి. ప్రతి రోజూ తాజా సమాచారాన్ని నోట్స్ రూపంలో తయారు చేసుకోవాలి. ఆయా పరీక్షలకు సంబంధించి గత ప్రశ్నపత్రాలను పరిశీలించాలి. ఇంటర్నెట్, పత్రికలు వంటి మాధ్యమాల ద్వారా సంబంధిత పరీక్షల సమాచారాన్ని క్షుణ్నంగా అవగాహన చేసుకోవాలి. గత విజేతలు, నిపుణులు సూచించిన ప్రామాణిక మెటీరియల్‌తో సన్నద్ధతను సాగించాలి. అవసరమైతే కోచింగ్ కూడా తీసుకోవచ్చు. ప్రైవేటు రంగంలో ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకున్న వాళ్లు అనుభవానికే ప్రాధాన్యమివ్వాలి. ఫలానా ఉద్యోగమే’ కావాలని వేచిచూసి.. సమయం వృథా చేసుకోకుండా.. అందివచ్చిన అవకాశాల్ని వినియోగించుకోవాలి. అనుభవం సంపాదించాలి. తద్వారా ఆ రంగంలో ఉన్నత అవకాశాలను చేజిక్కించుకోవాలి. ఈ క్రమంలో ఉద్యోగం చేస్తూనే సంబంధిత రంగంలో ఉన్నత విద్య అవకాశాలను అన్వేషించాలి.
 
 ప్రోత్సాహకాలు
 ప్రస్తుతం సైన్స్ విభాగంలో పీహెచ్‌డీ చేసిన అభ్యర్థుల సంఖ్య తక్కువగా ఉంటోంది. దాంతో సంబంధిత విభాగాలు మానవ వనరుల కొరతను ఎదుర్కొంటున్నాయి. దీంతో ప్రాథమిక దశ నుంచే విద్యార్థులను పరిశోధనల దిశగా ప్రోత్సహించే ఉద్దేశంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం పలు రకాల స్కాలర్‌షిప్‌లు, ఫెలోషిప్‌లను అందజేస్తుంది. అవి.. కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన (కేవీపీవై-www.kvpy.org.in), ఇన్‌స్పైర్ స్కాలర్‌షిప్స్/ఫెలోషిప్స్ (www.inspire-dst.gov.in), యూజీసీ కూడా దాదాపు 13 రకాల ఫెలోషిప్స్/ స్కాలర్‌షిప్స్ (ఠీఠీఠీ.ఠజఛి.్చఛి.జీ)ను, స్వర్ణజయంతి ఫెలోషిప్స్, మహిళల కోసం ఉమెన్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ కింద ఎన్నో రకాల స్కాలర్‌షిప్స్‌ను అందజేస్తుంది. కేవలం బ్యాచిలర్ డిగ్రీకే పరిమితం కాకుండా, పీజీ/పీహెచ్‌డీ వంటి ఎన్నో ఉన్నత కోర్సులను చదవడానికి, పరిశోధనల్లో తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఈ స్కాలర్‌షిప్స్ ఉపయోగపడతాయి. దీన్ని బట్టి సైన్స్ స్ట్రీమ్‌కు ఎంత ప్రాధాన్యత లభిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో సైన్స్ కోర్సులను చదివితే అవకాశాలు పుష్కలం అని చెప్పొచ్చు.
 
 జాబ్ ఓరియెంటెడ్ డిగ్రీలకు డిమాండ్
 ప్రస్తుతం జాబ్ ఓరియెంటెడ్ డిగ్రీలకు మంచి డిమాండ్ ఉంది. ఈ క్రమంలోనే బ్యాచిలర్ స్థాయిలో వివిధ రకాల కాంబినేషన్లతో కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. బీఎస్సీతో పాటు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంశాల్లో రెండు, మూడు వారాల పాటు శిక్షణ ఇస్తున్నాం. ఆర్ట్స్ చదివే విద్యార్థులు కూడా కంప్యూటర్స్‌పై అవగాహన, డేటా ఎంట్రీ, సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ వంటి అంశాలను నేర్చుకుంటున్నారు. బీఎస్సీలో న్యూట్రిషిన్, ఫుడ్ టెక్నాలజీ వంటి కాంబినేషన్లు ఉండటం వల్ల గ్రాడ్యుయేషన్ పూర్తికాగానే ఉద్యోగావకాశాలుంటున్నాయి. ప్రస్తుతం ఇలాంటి కోర్సులు పూర్తిచేసిన వారు ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకోవచ్చు. ఉన్నత విద్య దిశగా వెళ్లాలంటే పీజీ స్థాయిలో వివిధ స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని పూర్తిచేయడం వల్ల కెరీర్ పరంగా మెరుగైన అవకాశాలను చేజిక్కించుకోవచ్చు. సొంత ప్రాజెక్టులతో అయితే స్వయం ఉపాధి పొందడంతో పాటు మరో పది మందికి ఉపాధి కల్పించవచ్చు.
 - ప్రొఫెసర్ బి.టి.సీత,
 ఉస్మానియా యూనివర్సిటీ కాలేజీ
 (మహిళలు), హైదరాబాద్.
 

మరిన్ని వార్తలు