ఎంసెట్ - 2014 టాపర్ల మనోగతాలు

12 Jun, 2014 04:59 IST|Sakshi
ఎంసెట్ - 2014 టాపర్ల మనోగతాలు

 నా లక్ష్యం.. సాఫ్ట్‌వేర్ కంపెనీ స్థాపనకాలేజీలో ఏ రోజు చెప్పిన పాఠాలను ఆ రోజే పూర్తిచేయడం, చదివినంతసేపూ ఏకాగ్రతతో చదవడం.. తన విజయానికి కారణమంటున్నాడు ఎంసెట్-2014 ఇంజనీరింగ్ మొదటి ర్యాంకర్ నందిగం పవన్ కుమార్. ఉన్నత చదువులు చదవాలని ఉన్నా ఆర్థిక ఇబ్బందులతో ఆ ఆశను నెరవేర్చుకోలేని అమ్మానాన్న ప్రోత్సాహం విజయశిఖరాలను చేర్చిందంటూ తన అంతరంగాన్ని ‘భవిత’తో పంచుకున్నారు...
 
 ఎంసెట్ ఇంజనీరింగ్ టాపర్
 పరీక్ష రాయడానికి ముందు ఏ రోజూ టాప్ ర్యాంకు వస్తుందని అనుకోలేదు. అయితే పరీక్ష తర్వాత కీ చూసుకున్నాను.. టాప్ ర్యాంక్ తప్పకుండా నాకే వస్తుందని అనుకున్నా. ఏకంగా మొదటి ర్యాంకుతో విజయాన్ని అందుకోవడం చాలా ఆనందం కలిగిస్తోంది. ఫిజిక్స్‌లో రెండు మార్కులు తగ్గటం వల్ల స్కోర్ 158 దగ్గర ఆగింది. ఎప్పటికప్పుడు నన్ను గమనిస్తూ, పొరపాట్లను సరిదిద్దుతూ ప్రోత్సహించిన అమ్మానాన్నకే ఈ విజయం దక్కుతుంది. మొదటి ర్యాంకు సాధించే దిశగా నాలో స్ఫూర్తి నింపింది మాత్రం గతేడాది జేఈఈ టాపర్, నా సీనియర్ అయిన సందీప్‌రెడ్డి. ఇప్పుడు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మంచి ర్యాంకు వచ్చే అవకాశముంది. అదే జరిగితే ముంబై ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్‌లో చేరుతా. భవిష్యత్తులో సాఫ్ట్‌వేర్ కంపెనీని ఏర్పాటు చేసి, కొందరికి ఉపాధి కల్పించాలన్నదే నా లక్ష్యం.
 
 వ్యక్తిగతం:
 మా నివాసం హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీ. అమ్మ దీప గృహిణి. నాన్న నారాయణరావు, ప్రైవేటు ఉద్యోగిగా పనిచేస్తున్నారు. చెల్లి కావ్య ప్రస్తుతం ఇంటర్ చదువుతోంది. నా చదువంతా హైదరాబాద్‌లోనే సాగింది. ఆరో తరగతి వరకు సెయింట్ మేరీస్ హైస్కూల్‌లో చదివాను. ఏడో తరగతి నుంచి పదో తరగతి వరకు చైతన్య టెక్నో స్కూల్‌లో చదివాను. ఇంటర్మీడియెట్ శార్వాణి కాలేజీలో చదివా. మొదట్నుంచీ బాగానే చదివేవాణ్ని. కేవీపీవై స్కాలర్‌షిప్ సాధించడం, ఫిజిక్స్ ఒలింపియాడ్‌లో అవార్డు తెచ్చుకోవడం నా అకడమిక్ జీవితంలో గొప్ప ఘటనలు.
 
 రోజూ క్రికెట్.. వారానికో సినిమా:
 మంచి ర్యాంకు సాధించాలంటే 24 గంటలూ పుస్తకాలతో కుస్తీపట్టాల్సిన అవసరం లేదు. ఓ ప్రణాళికా ప్రకారం చదివితే చాలు! ఇంటర్ మొదటి ఏడాదిలో చేరినప్పటి నుంచి ఎప్పటి సిలబస్‌ను అప్పుడే పూర్తిచేసేవాణ్ని. నాకు ఇష్టమైన సబ్జెక్టు కెమిస్ట్రీకి అధిక సమయం కేటాయించాను. మానసిక ప్రశాంతత కోసం రోజూ కొంత సమయం క్రికెట్ ఆడేవాణ్ని. వారానికో సినిమా చూసేవాణ్ని. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండేవాణ్ని.
 
 ఇంటర్‌కోసం రెండు వారాలే:
 ఇంటర్ సెకండియర్‌లో పూర్తి సమయం ఎంసెట్, జేఈఈ వంటి పోటీ పరీక్షల ప్రిపరేషన్‌కే కేటాయించాను. ఇంటర్ బోర్డు పరీక్షలకు రెండు వారాల ముందు మాత్రమే చదివాను. కాలేజీ క్యాంపస్‌లో ఉదయం నుంచి సాయంత్రం వరకు టీచింగ్ ఫ్యాకల్టీ అందుబాటులో ఉండేవారు. సబ్జెక్టుకు సంబంధించి ఎప్పుడు ఏ సందేహమొచ్చినా, వెంటనే నివృత్తి చేసేవారు. దీంతో గ్రాండ్ టెస్ట్‌లో మంచి స్కోర్ వస్తుండేది. కెమిస్ట్రీకి రోజులో ఎక్కువ సమయం కేటాయిస్తూ, ఫిజిక్స్ రెండు గంటలు చదివాను. మ్యాథమెటిక్స్ సమస్యల్ని రోజూ ప్రాక్టీస్ చేసేవాణ్ని. ఇలా ప్రణాళిక ప్రకారం చదవడం వల్ల అన్ని సబ్జెక్టులపైనా పట్టు చిక్కింది. ప్రశ్నలు ఏ చాప్టర్ నుంచి ఎలా వచ్చినా, సమాధానం రాసే సామర్థ్యం సొంతమైంది.
 
 పాఠ్య పుస్తకాలు ప్రధానం:
 ఇంటర్ ఆధారంగా జరిగే ఏ పరీక్షలో అయినా ప్రశ్నలన్నీ పాఠ్యపుస్తకాల నుంచే ఇవ్వాలి. అందుకే మొదట ఆ పుస్తకాలను ఆసాంతం చదవాలి. బట్టీపట్టడం కాకుండా అర్థం చేసుకుంటూ, ఏకాగ్రతతో చదవాలి. మ్యాథమెటిక్స్‌కు ప్రాక్టీస్ ముఖ్యం కాబట్టి ఎక్కువ సమయం కేటాయించాలి. మన ఆలోచనలే మనకు బలం. ‘‘నేను సాధించగలను’’ అనే సానుకూల దృక్పథం ఉంటే విజయం మనదే. అన్నిటికీ మించి నాకు మంచి ర్యాంకు వస్తుందో.. లేదో? అని ఆందోళన చెందుతూ, ఒత్తిడి పెంచుకోకూడదు. ర్యాంకు గురించి ఆలోచించకుండా నిజాయితీగా కష్టపడితే సక్సెస్ సొంతమవుతుంది.
 
 పర్సనల్ ప్రొఫైల్:
     పదోతరగతి: 9.7 జీపీఏ.
     ఇంటర్మీడియెట్: 980 మార్కులు.
     ఎంసెట్ మార్కులు: 158/160
     కంబైన్డ్‌స్కోరు: 99.02
 
 నా లక్ష్యం.. న్యూరాలజిస్టు!
 ఎంసెట్ మెడిసిన్ టాపర్

 ఎంసెట్ మెడిసిన్ విభాగంలో టాప్ 5లో ఉంటాననుకున్నా. అయితే ఏకంగా మొదటి ర్యాంకు రావడంతో చాలా ఆనందంగా ఉంది. ప్రతి 15 రోజులకోసారి కాలేజీకి వచ్చి, నా చదువు గురించి తెలుసుకొని, ఆపై తప్పులు సరిదిద్ది ప్రోత్సహించిన అమ్మానాన్నకే ఈ విజయం చెందుతుంది.
 
 వ్యక్తిగతం:
 మాది ప్రకాశం జిల్లా మార్కాపూరం. నాన్న డాక్టర్ గుర్రం మోహన్‌రామ్, ఆర్థోపెడిక్. అమ్మ డాక్టర్ రాధిక, ఆప్తమాలజిస్టు. ఇద్దరూ మార్కాపురంలోనే ప్రాక్టీస్ చేస్తున్నారు. పదో తరగతి తర్వాత ఇంటర్‌లో ఎంపీసీ తీసుకొని, సాంకేతిక విద్య దిశగా వెళ్లాలనుకున్నాను. కానీ, అభిప్రాయం మారి, బైపీసీలో చేరి.. ఇప్పుడు మంచి విజయం సాధించాను.
 
 ఎప్పుడూ ఉత్తమ విద్యార్థినే:
 ఒకటో తరగతి నుంచి ఎప్పుడూ ఉత్తమ విద్యార్థిగానే ఉండేవాణ్ని. తరగతిలో టాప్ ర్యాంకు వచ్చేది. 1-4వ తరగతి వరకు లయోలా హైస్కూల్, ఐదో తరగతి సాయిబాబా స్కూల్‌లో చదివాను. 6-10 వ తరగతి వరకు ఢిల్లీ పబ్లిక్‌స్కూల్ (సీబీఎస్‌ఈ సిలబస్)లో చదివాను. ఇంటర్మీడియట్ శ్రీచైతన్య కాలేజీలో పూర్తిచేశాను. ఎంసెట్‌లో ఫిజిక్స్‌లో బబ్లింగ్ తప్పిదం వల్ల ఒక మార్కు తగ్గింది.
 
 ఇంటర్‌కు నెలరోజులు:
 పేరున్న జాతీయ సంస్థలో వైద్య విద్యను అభ్యసించాలని ఉండేది. అదే లక్ష్యంతో ప్రిపరేషన్ కొనసాగించాను. ఎంసెట్‌తో పాటు జిప్‌మిర్, ఏఎంసీ, సీఎంసీ, ఏఐపీఎంటీ పరీక్షలు రాశాను. ఇంటర్ బోర్డు పరీక్షలకు నెల రోజులు మాత్రమే చదివాను. రోజూ ఉదయం 6-12 గంటల వరకు తరగతులు. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 11 గంటల వరకు స్టడీఅవర్స్. రెండేళ్లపాటు ఇలా చదవటం వల్ల రాసిన పరీక్షలన్నింటిలోనూ మంచి ర్యాంకు తెచ్చుకోగలిగా. ఇంటర్ అర్హతతో జరిగే ఏ పరీక్షలో అయినా అడిగే ప్రశ్నలన్నీ ఇంటర్మీడియట్ సిలబస్ ఆధారంగానే ఉంటాయి. కాబట్టి ఎక్కడా సమస్యలు ఎదురుకాలేదు. వేర్వేరు పరీక్షలకు సిద్ధమవుతున్న భావన రాలేదు.
 
 మొదటి లక్ష్యం.. న్యూరాలజిస్టు:
 ఎంసెట్‌తో పాటు జాతీయస్థాయి వైద్య కోర్సుల ప్రవేశ పరీక్షలకు హాజరయ్యా. ఏఎంసీ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నా. వెల్లూరు సీఎంసీకు రెండో దశ ఇంటర్వ్యూకు పిలుపొచ్చింది. ఏఐపీఎంటీలో ఆలిండియా 38వ ర్యాంకు వచ్చింది. అత్యున్నత సంస్థలో ఎంబీబీఎస్ పూర్తిచేయడం, ఆ తర్వాత న్యూరాలజిస్టు కావడం నా మొదటి లక్ష్యం. పరిశోధనలు చేసి, వైద్యునిగా సమాజానికి నా వంతు తోడ్పాటును అందించాలన్నది నా ఆశయం.
 
 సిలబస్‌ను అనుసరిస్తే చాలు:
 ఎంసెట్‌లో మంచి ర్యాంకు సాధించాలంటే మొదట చేయాల్సింది తరగతిలో టీచర్ చెప్పిన పాఠాలను శ్రద్ధగా వినడం. ఏ రోజు చెప్పిన పాఠాలను ఆ రోజే చదవడం పూర్తిచేయాలి. లేదంటే ఒత్తిడి పెరిగి, ప్రిపరేషన్ గాడి తప్పుతుంది. సిలబస్ కొండలా కనిపిస్తుంది. మెడిసిన్ ప్రవేశ పరీక్షలో చాలా పోటీ ఉంటుంది. అయితే కాస్త ఏకాగ్రతతో ప్రిపరేషన్ కొనసాగిస్తే మంచి ర్యాంకు తెచ్చుకోవచ్చు. ఇంటర్‌లో చేరిన మొదటి రోజు నుంచే ఏకాగ్రతతో ప్రతి సబ్జెక్టును క్షుణ్నంగా చదవడం అలవరచుకోవాలి. సిలబస్‌ను అర్థం చేసుకుంటూ, ప్రణాళిక ప్రకారం చదవాలి. కాలేజీలో ఇచ్చే మెటీరియల్‌ను విశ్లేషణాత్మకంగా చదవాలి.
 
 
 అకడెమిక్ ప్రొఫైల్:
     పదో తరగతి: 10 జీపీఏ.
     ఇంటర్మీడియెట్: 972 మార్కులు.
     ఎంసెట్ మార్కులు: 159/160.
     కంబైన్డ్‌స్కోరు: 99.45
 

మరిన్ని వార్తలు