నిజామాబాద్ - ముగ్గురు టీ వాదుల ముక్కోణపు పోటీ

17 Apr, 2014 15:15 IST|Sakshi
నిజామాబాద్ - ముగ్గురు టీ వాదుల ముక్కోణపు పోటీ

తెలంగాణ జిల్లాల్లో అత్యంత ఆసక్తికరమైన పోటీ ఏది అని అడిగితే ఎవరైనా చూపించేది నిజామాబాద్ వైపే. ఎందుకంటే అక్కడ నుంచి తెలంగాణ రాజకీయాల్లో నవతార కల్వకుంట్ల కవిత తొలిసారి బ్యాలెట్ పోటీలోకి దిగారు. ఇప్పటి వరకూ ఎన్నికల్లో పోటీ చేయని ఆమెపై రెండు సార్లు ఎంపీగా గెలిచిన మధు యాష్కి గౌడ్, రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఎండల లక్ష్మీనారాయణ పోటీలో ఉన్నారు. కవిత టీఆర్ ఎస్ నుంచి, మధు యాష్కి కాంగ్రెస్ నుంచి, ఎండల బిజెపి నుంచి పోటీ పడుతున్నారు.


అటు మహారాష్ట్ర, ఇటు కర్నాటకలతో సరిహద్దు షేర్ చేసుకునే నిజామాబాద్ లో అంకాపూర్ లాంటి అత్యంత ధనిక ఊర్లు, అతి వెనుకబాటుతనంలో బాధపడే గాంధారి లాంటి ఊర్లు కలగలిసి ఉన్నాయి. ముస్లిం, మరాఠీ, లంబాడీ వర్గాలతో పాటు, కొన్ని ప్రాంతాల్లో మున్నూరు కాపులు పుష్కలంగా ఉన్నారు.


ముగ్గురూ తెలంగాణవాదులేః తెలంగాణ వాదం అత్యంత బలంగా ఉన్న జిల్లాల్లో నిజామాబాద్ ఒకటి. ముగ్గురు అభ్యర్థులూ వీరతెలంగాణ వాదులే. కవిత తెలంగాణ జాగృతిని స్థాపించి బతుకమ్మ, తెలంగాణ సంస్కృతిని ప్రోత్సహించారు. కేసీఆర్ కుమార్తెగా ఆమెకు తెలంగాణ వాదం వారసత్వ ఆస్తిగా సంక్రమించింది. ఇక మధుయాష్కీ తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర వహించిన కాంగ్రెస్ నేతల్లో ఒకరని ప్రచారం. బిజెపి అభ్యర్థి ఎండల లక్ష్మీనారాయణ తెలంగాణ వాదం కోసం ఎమ్మెల్యే సీటును త్యాగం చేశారు.


గత చరిత్ర ఏం చెబుతోందిః గత చరిత్రను చూస్తే కాంగ్రెస్ కి సానుకూలాలు చాలానే ఉన్నాయి. ఇప్పటి వరకూ కాంగ్రెస్ నిజామాబాద్ నుంచి 11 సార్లు గెలిచింది. టీడీపీ మూడు సార్లు గెలిచింది. టీఆర్ ఎస్ 2009 లో తొలిసారి పోటీ చేసింది. ఓడిపోయింది. అయితే టీఆర్ ఎస్ తొలినాళ్లలోనే నిజామాబాద్ జిల్లాపరిషత్ ను గెలుచుకుంది.  ఇక 2009 లో టీడీపీకి మూడు, బిజెపికి ఒక అసెంబ్లీ నియోజవర్గాలు వచ్చాయి. కాంగ్రెస్ ఒక సీటు, పీఆర్ పీ ఒక సీటు గెలుచుకున్నాయి. పీఆర్ పీ తరువాత కాంగ్రెస్ లో కలిసిపోయింది. ఈ లెక్కన బిజెపి అభ్యర్థికి అనుకూలంగా ఉండాలి. అయితే తెలంగాణ ఏర్పాటు తరువాత ఈ లెక్కలు పనికిరావు.


కవిత కరిష్మా, మధుయాష్కీ పాత పరిచయాలకు, మోడీ మోత మోగిస్తున్న ఎండలకు మధ్యే ప్రధానంగా పోటీ. తెలంగాణ తెచ్చింది మేమేనని మధు యాష్కీ అంటే, తెస్తే చాలదు. అభివృద్ధి చేయాలి. అది టీఆర్ ఎస్ చేస్తుందని కవిత అంటున్నారు. వచ్చేది మోడీ ప్రభుత్వం కాబట్టి మాకే ఓటేయండి అని ఎండల అంటున్నారు.


ప్రధాన సమస్యలుః నిజామాబాద్ గోదావరి ముఖద్వారం లాంటిది. మన రాష్ట్రంలోకి గోదారమ్మ ఇక్కడి నుంచే వస్తుంది. పోచంపాడు, అలీసాగర్, నిజాంసాగర్ వంటి ప్రాజెక్టులు కొంత ఏరియాని సస్యశ్యామలం చేసిన మాట ఎంత నిజమో, లెండి, గుత్ప, కౌలాస్ నాలా వంటి ప్రాజెక్టులు పెండింగ్ లో ఉండటం వల్ల వస్తున్న సమస్యలూ అంతే వాస్తవం.


నియోజకవర్గంలో నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బోధన్, బాల్కండ, ఆర్మూర్, కొరాటియాలతో పాటు కరీంనగర్ లోని జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఏప్రిల్ 30 కి నిజామాబాద్ ఎవరి ఖాతాలోకి వెళ్తుందో తేలిపోతుంది.

మరిన్ని వార్తలు