పార్లమెంటరీ నేత ఎవరో?

18 May, 2014 04:10 IST|Sakshi
పార్లమెంటరీ నేత ఎవరో?

 ‘కారు’లో ఇద్దరు జిల్లా నేతల మధ్య పోటీ
- బోయినపల్లి వర్సెస్ కడియం
- అధినేత కేసీఆర్‌దే తుది నిర్ణయం

 
వరంగల్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన గులాబీల్లో కొత్త ఉత్సాహం నెలకొనగా... నేతల మధ్య పదవుల పందేరం కూడా మొదలైంది. టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎంపికయ్యేందుకు జిల్లాకు చెందిన ఇద్దరు నేతలు పోటీలో ఉన్నారు. తెలంగాణ భవన్‌లో శనివారం టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీల సమావేశం జరిగింది. శాసన సభాపక్ష నేతగా కేసీఆర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నప్పటికీ... పార్లమెంటరీ నాయకుడి ఎంపికను వాయిదా వేశారు. త్వరలో దీనిపై కేసీఆర్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

జిల్లాకు చెందిన హన్మకొండ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ ఈ ఎన్నికల్లో కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించారు. వరంగల్ ఎంపీగా మాజీ మంత్రి కడియం శ్రీహరి గెలుపొందారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో 11 మంది ఎంపీలు టీఆర్‌ఎస్ నుంచి గెలిచారు. ఉత్తర తెలంగాణ నుంచి గెలుపొందిన నాయకులకు ఈ పదవి వరిస్తుందనే చర్చ పార్టీ వర్గాల్లో సాగుతోంది. వినోద్‌కుమార్ సీనియర్ ఎంపీగా ఉన్న అనుభవం, ఢిల్లీలో ఇతర పక్షాలతో ఉన్న పరిచయాలు పరిగణనలోకి తీసుకుంటే ఆయనకు అవకాశం దక్కనుంది.

 వినోద్‌కు సామాజిక వర్గం అడ్డుగా మారుతుందనే చర్చ ఆ పార్టీలో కొనసాగుతోంది. ఇప్పటికే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని ఇంతకాలం చెబుతూ వచ్చిన టీఆర్‌ఎస్... తీరా అధికారంలోకి రాగానే కేసీఆర్‌ను ఆ పీఠంపై కూర్చొబెట్టేందుకు రంగం సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ కారణంగా ఎంపీగా అనుభవం లేనప్పటికీ... మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న దళితవర్గానికి చెందిన కడియం శ్రీహరికి అవకాశం కల్పిస్తారని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నారు. దళిత సీఎం అవవాదును ఈ రూపంలో తొలగించుకునేందుకు అధినేత ప్రయత్నించవచ్చని వారు విశ్లేషిస్తున్నారు. వీరితోపాటు మహబూబ్‌నగర్ నుంచి గెలిచిన జితేందర్‌రెడ్డి పోటీలో ఉన్నట్లు తెలిసింది.  దీనిపై తుది నిర్ణయం మాత్రం కేసీఆర్‌దేనని పేర్కొంటున్నారు.

>
మరిన్ని వార్తలు