రోగాల పీచమణిచే పీచు పదార్థాలు

17 May, 2018 00:27 IST|Sakshi

హై–ఫైబర్‌ 

పీచు పదార్థాలు జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయని అందరికీ తెలిసిన విషయమే. పీచు పదార్థాలు మరో మేలు కూడా చేస్తాయని ఒక తాజా పరిశోధనలో బయటపడింది. జీర్ణ వ్యవస్థకు మేలు చేయడమే కాకుండా అవి రోగ నిరోధక వ్యవస్థను కూడా బలోపేతం చేస్తాయని ఆస్ట్రేలియన్‌ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పీచు పదార్థాలు తెల్ల రక్తకణాల సంఖ్యను వృద్ధి చేస్తాయని, అందువల్ల ఆహారంలో పీచుపదార్థాలను పుష్కలంగా తీసుకునే వారు సాధారణమైన జలుబు మొదలుకొని రకరకాల వైరల్‌ ఇన్ఫెక్షన్ల నుంచి త్వరగా కోలుకోగలుగుతారని ఆస్ట్రేలియాలోని మోనాష్‌ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

పీచు పదార్థాలను బాగా తీసుకునే వారిలో ఊపిరితిత్తుల సామర్థ్యం కూడా బాగుంటుందని ఉబ్బసం సహా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులను వారు సమర్థంగా తట్టుకుని, త్వరగా తేరుకోగలరని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. పొట్టు తీయని ధాన్యాలు, గింజ ధాన్యాలు, అవిసెగింజలు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లలో పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయని, రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉండాలంటే వీటిని రోజూ తప్పనిసరిగా తీసుకోవడం మంచిదని వారు సూచిస్తున్నారు.

మరిన్ని వార్తలు