పరిమళం తగ్గుతోంది!

23 Mar, 2018 00:09 IST|Sakshi

న్యూస్‌ 

ఇదివరకటి కాలంలో వసంతం వచ్చిందంటే చాలు, పూల వనాలు పరిసరాలను పరిమళ భరితం చేసేవి. ఇప్పటి కాలంలో వసంతమైతే వస్తోంది గాని, పూల వనాలు ఇదివరకటి స్థాయిలో పరిమళించడం లేదు. ప్రకృతి ధర్మసూత్రాలకు లోబడి వసంతంలో మొక్కలకు ఆకులు చిగురించి, పూలు పూస్తూనే ఉన్నా, పూల పరిమళంలోని గాఢత మాత్రం క్షీణిస్తూ వస్తోందని యూనివర్సిటీ ఆఫ్‌ రీడింగ్‌కు చెందిన బ్రిటిష్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ రాబర్ట్‌ గర్లింగ్‌ చెబుతున్నారు. డీజిల్‌తో నడిచే వాహనాల నుంచి వెలువడే వాయువుల ప్రభావం వల్ల పూలలో పరిమళం తగ్గిపోతోందని ఆయన వెల్లడిస్తున్నారు.

రాయల్‌ హార్టికల్చరల్‌ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన పరిశోధనలో వాయు కాలుష్యం ఫలితంగా పూల పరిమళం గణనీయంగా తగ్గిపోతున్నట్లు తేలింది. లావెండర్, డఫోడిల్స్, మల్లెలు, గులాబీలు వంటి పూల పరిమళం ఇదివరకటి కాలంలో చాలా దూరం నుంచే నాసికకు తెలిసేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ఈ పరిశోధనలో వెల్లడైంది. ఈ పరిశోధన వివరాలను ‘న్యూ సైంటిస్ట్‌’ జర్నల్‌లో ప్రచురించారు.

మరిన్ని వార్తలు