ఎప్పుడు తినాలో తెలిస్తేనే.. బరువు తగ్గుతారు!

22 Mar, 2018 00:38 IST|Sakshi

వేళాపాళా లేని ఆహారంతో ఒళ్లు పెరిగిపోవడమే కాకుండా అనేకానేక చిక్కులు వస్తాయన్న సంగతి తెలిసిందే. ఒళ్లు తగ్గించుకునేందుకు చేసే ప్రయత్నాల్లో ఏ సమయంలో ఆహారం తీసుకుంటామన్నది ముఖ్యమవుతుందని అంటున్నారు కాలిఫోర్నియాలోని సాల్క్‌ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు. మన పూర్వీకులతో పోలిస్తే ఇప్పుడు చాలామంది అర్ధరాత్రి వరకూ మేలుకుని ఉండటం, అదే సమయంలో చిరుతిళ్లను ఎక్కువగా తీసుకోవడం చేస్తూంటారని.. ఈ అలవాట్లు రెండూ ఒళ్లు తగ్గించుకునే విషయంలో ప్రతికూల ప్రభావం చూపుతాయని వీరు హెచ్చరిస్తున్నారు.

రెండు గుంపుల ఎలుకలకు వేర్వేరు సమయాల్లో ఆహారం అందించడం ద్వారా వాటిలో వచ్చిన మార్పులను తాము పరిశీలించామని, కొంత కాలం తరువాత పరిశీలించగా.. రోజుకు ఎనిమిది గంటలపాటు మాత్రమే ఆహారం అందుబాటులో ఉన్న ఎలుకలు ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిసిందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఒకరు చెప్పారు. రోజంతా ఆహారం అందుబాటులో ఉన్న ఎలుకలు ఎప్పుడు పడితే అప్పుడు ఆహారం తీసుకోవడం ద్వారా లావెక్కిపోయాయని వివరించారు. దీన్నిబట్టి రోజులో వీలైనంత తక్కువ సమయంలో ఆహారం తీసుకోవాలని తమ అధ్యయనం చెబుతోందంటున్నారు. 

మరిన్ని వార్తలు