స్త్రీలోక సంచారం

7 Nov, 2018 00:13 IST|Sakshi

అన్నిట్లోనూ స్త్రీలు తక్కువ, పురుషులు ఎక్కువ అన్నట్లు ఉంటుంది మన దేశంలో. అభివృద్ధికి టెక్నాలజీ ఒక మెట్టు అనుకుంటాం కదా. ఆ టెక్నాలజీ ఎక్కువగా అందుబాటులో ఉన్నది కూడా పురుషులకేనట. భారతదేశంలో టెక్నాలజీ వినియోగంపై తాజాగా ‘హార్వర్డ్‌ కెన్నెడీ స్కూల్‌’ సర్వే చేసినప్పుడు ఈ అసమానత్వం బైట పడింది. స్మార్ట్‌ఫోన్‌ లేని చెయ్యి ఇప్పుడు ఇండియాలో దాదాపుగా కనిపించదు. మరీ స్మార్ట్‌ఫోన్‌ కాకున్నా, మామూలు ఫోన్‌ అయినా ఉండని మనిషి ఉంటారని ఊహించలేం. అయితే.. ఇప్పటికీ భారతదేశంలోని అనేక గ్రామాల్లో, కొన్నిచోట్ల పట్టణాల్లో కూడా మొబైల్‌ ఫోన్‌ వాడని మహిళలు ఉన్నారట! దీనికి కారణం.. పూర్తిగా లింగవివక్షేనని అనలేం కానీ.. మహిళలే వాళ్లంతవాళ్లు.. ఫోన్‌ వినియోగాన్ని ఒక పాపకార్యంలా భావించి, దూరంగా ఉంటున్నట్లు సర్వేలో తేలింది! మరి అత్యవసరంగా ఫోన్‌ చేయాలన్నా, ఫోన్‌ రిసీవ్‌ చేసుకోవాలన్నా ఎలా? ఇంట్లో మగవాళ్లు ఉంటారు కదా. వాళ్ల సహాయం తీసుకుంటారు. ‘ది టఫ్‌ కాల్‌ : అండర్‌స్టాండింగ్‌ బ్యారియర్స్‌ టు అండ్‌ ఇంపాక్ట్‌ ఆఫ్‌ విమెన్స్‌ మొబైల్‌ ఫోన్‌ అడాప్షన్‌ ఇన్‌ ఇండియా’ అనే పేరుతో హార్వర్డ్‌ కెన్నెడీ స్కూల్‌ విడుదల చేసిన నివేదికలో.. ఈ ‘మొబైల్‌ అసమానత’ స్త్రీ పురుషుల మధ్య 33 శాతం వరకు ఉన్నట్లు స్పష్టం అయింది.

రెండేళ్ల క్రితం ‘హండ్రెడ్‌ ఇండియన్‌ టిండర్‌ టేల్స్‌’ అనే వంద సచిత్ర కథనాల పుస్తకంతో సంచలనాత్మక భారతీయ చిత్రకారిణిగా గుర్తింపు తెచ్చుకున్న ఇందు హరికుమార్‌ (ముంబై) ఇప్పుడు మరొక ప్రయోగం చేస్తున్నారు. భారతీయ స్త్రీల లైంగిక అనుభవాల చిత్ర లేఖన సంకలనాన్ని బయటికి తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు. వాస్తవానికి ‘టిండర్‌ టే ల్స్‌’లో ఇందు చేసింది కూడా దాదాపుగా ఇప్పుడు చేయబోతున్నదే. స్త్రీ, పురుష జాతుల మధ్య సయోధ్యను ఏర్పరిచే భావచిత్రాలను మునుపు గీస్తే, ఇప్పుడు స్త్రీ దైహిక వాంఛల అభివ్యక్తీకరణకు మాత్రమే పరిమితమవుతున్నారు. సమాజంలో నేటికీ కొన్ని మాట్లాడకూడని విషయాలు ఉన్నాయి. ఆ నిషిద్ధాలనే ఇందు హరికుమార్‌ తన శుద్ధమైన రేఖల్లో ప్రతిఫలింపజేస్తున్నారు. 

మరిన్ని వార్తలు