సాక్షి, న్యూఢిల్లీ: ఫోర్టిస్ ఆస్పత్రి నిర్వాకం మరువకముందే గుర్గ్రామ్కు చెందిన మరో కార్పొరేట్ ఆస్పత్రి డెంగ్యూతో బాధపడుతున్న ఎనిమిదేళ్ల బాలుడి చికిత్సకు రూ. 16 లక్షలు వసూలు చేసింది. 21 రోజుల పాటు చికిత్స చేసినా చివరికి బాలుడు మరణించడంతో ఫలితం లేకుండా పోయింది. భారీ బిల్లులతో బెంబేలెత్తిన బాలుడి తల్లితండ్రులు మెదాంత ఆస్పత్రి నుంచి వేరే ఆస్పత్రికి తీసుకువెళ్లారు. గుర్గ్రాంలోని మెదాంత ఆస్పత్రిలో తమ కుమారుడి చికిత్సకు 21 రోజులకు రూ.16 లక్షలు బిల్లు ఇచ్చారని, చికిత్స పేరుతో ఆస్పత్రి తమను లూటీ చేసిందని బాధిత బాలుడి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.
చికిత్స నిమిత్తం డబ్బు కోసం తాము పలువుని అర్థించామని చెప్పుకొచ్చారు. పరిస్థితి ప్రమాదకరంగా మారిన తర్వాత బాలుడిని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలని మెదాంత వైద్యులు చెప్పగా తాము అక్కడికి తరలించామని తెలిపారు.మెదంత ఆస్పత్రి నిర్వాకంపై తమకు ఫిర్యాదు అందిందని సదర్ పోలీస్ స్టేషన్ అధికారులు చెప్పారు.
ఈ ఏడాది సెప్టెంబర్లో మూడేళ్ల ఆద్యా సింగ్ డెంగ్యూతో బాధపడుతూ 15 రోజుల చికిత్స అనంతరం మరణించింది. పాపకు చికిత్స కోసం ఫోర్టిస్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి రూ.16 లక్షలు బిల్లు ఛార్జ్ చేయడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే.