పాదం మీద.. పుట్టుమచ్చనవుతా

11 Aug, 2014 10:30 IST|Sakshi
పాదం మీద.. పుట్టుమచ్చనవుతా

ఆ మువ్వల సవ్వడిలో అక్కల ఆప్యాయత ఉంది. ఎలుగెత్తి వినిపించే ఆ గొంతుకలో తోబుట్టువుల అనురాగం దాగుంది. అందుకే ఆ గళం.. ఆడపడుచుల ఆర్తనాదమైంది. ఆ పాదాల మీద పుట్టుమచ్చై రుణం తీర్చుకుంటానంది. మల్లె తీగకు పందిరిలా మారిపోతానంది. మసక చీకటిలో వెన్నెల వెలుగులు నింపుతానంది. ఈ ఆర్ద్రత వెనుక అలవికాని అనురాగం ఉంది. సిరిమల్లె చెట్టు కింద చినబోయిన లచ్చువమ్మ గోస ఉంది. అజ్ఞాతంలో పల్లవించిన గళం కోసం అల్లాడిపోయిన అక్కల ఆవేదన ఉంది. తన జీవితమంతా అక్కలతో ముడిపడి ఉందంటున్న ప్రజాగాయకుడు గద్దర్ రాఖీ బంధాన్ని, అనుబంధాన్ని ‘సిటీప్లస్’తో పంచుకున్నారు.
 -  వనం దుర్గాప్రసాద్
 
 నాకు ముగ్గురు అక్కలు. నా చిన్నతనంలోనే వాళ్ల పెళ్లిళ్లు అయ్యాయి. అయినా వాళ్లకు నేనంటే ప్రాణం.
 
  పెద్దక్క పేరు
 సరస్వతీబాయి. రెండో అక్క శాంతాబాయి. మూడో అక్క బాలమణి. మొదటి ఇద్దరూ కాలం చేశారు. ఇప్పుడున్నది మూడో అక్కే. పెద్దక్కను ఔరంగాబాద్‌కు ఇచ్చాం. రెండో అక్క అల్వాల్‌లోనే ఉండేది. మూడో అక్క మేడ్చల్‌లో ఉంటుంది. నిజానికి రెండో అక్క దగ్గరే ఎక్కువ కాలం ఉండేవాణ్ని. ఆమెలో ఉద్యమ భావాలు బాగా నచ్చేవి. నక్సల్స్ ఉద్యమంపై తీవ్ర నిర్బంధం ఉన్న రోజుల్లోనూ ఉద్యమ నేతలకు ఆమె రాఖీ కట్టేది. కొండపల్లి సీతారామయ్య వంటి నాయకులకు శాంతాబాయి చాలాసార్లు రాఖీ కట్టింది. అందుకే ఆమె ప్రజా ఉద్యమానికే సోదరిగా భావిస్తాం. అజ్ఞాతంలో ఎక్కువ గడపడం వల్ల నేను వాళ్లకు చాలా కాలం దూరంగానే ఉన్నాను. పెద్దక్క మాత్రం ఏటా ఇంటికొచ్చేది. బావ వాళ్ల తమ్ముళ్లకు దుస్తులు కొంటే తను నాకు కూడా కొనేది. అక్కంటే ప్రాణం కావడం వల్లేమో, ఆమె తెచ్చేవన్నీ నాకు నచ్చేవి.
 
 ఆ రాఖీ అలాగే..
 రాఖీ పండుగొస్తే ఎంతో మంది ఈ అన్నకు రాఖీలు కడతారు. కానీ రెండో అక్క శాంతాబాయి రాఖీ అంటే నాకు చాలా ఇష్టం. దాన్ని ఊడిపోయే వరకూ విప్పే ప్రసక్తే లేదు. ఒక రోజు ముందే రాఖీ కొనేది. ‘రేపు రాఖీ... ఎక్కడికీ వెళ్లకూ...’ అని ముందే హెచ్చరించేది. పొద్దున్నే స్నానం చేసేవరకే అక్క సిద్ధంగా ఉండేది. రాఖీ కట్టి ఆత్మీయంగా కౌగిలించుకునేది. ఆ అక్కకు నేనేమిచ్చి రుణం తీర్చుకుంటాన? అక్క కట్టిన ఆ రాఖీ చేతికున్నంత సేపు రాలిపోయే స్వర్ణక్కలు.. వాడిపోయే లచ్చుమమ్మలు గుర్తుకొస్తారు. ఆ రాఖీలో
 అంత శక్తి ఉందనిపిస్తుంది.
 
మాదంతా రివర్స్
 ‘రాఖీ కట్టావ్.. అన్న నీకు ఏం ఇచ్చాడు?’ సాధారణంగా విన్పించే ప్రశ్న ఇది. కానీ మా ఇంట్లో భిన్నంగా ఉంటుంది. రాఖీ కట్టిన అక్క ఆ రోజు ఆమె దగ్గర ఎంత ఉంటే అంత ఇవ్వాల్సిందే. సోదర భావాన్ని సామాజిక, మానవీయ కోణంలో చూడాలని కోరుకుంటాను. నిజానికి ఆ సోదర ప్రేమను ఏ రూకలతో కొలుస్తాం? ఆ సెంటిమెంట్‌ను బలమైన బంధంగా మార్చే సన్నివేశానికి ఎలా వెలకడతాం? నేను మాత్రం పాట, మాట, ఆటతోనే ఆ అక్కలకు జోహార్లర్పిస్తాను. ఎర్రపూల దారిలోనే పాదాభివందనం చేస్తాను.
 
అజ్ఞాతంలో మరుపురాని జ్ఞాపకం
నేను అజ్ఞాతంలో ఉన్నాను. ఒకసారి పెద్దక్కను ఔరంగాబాద్‌లో రహస్యంగా కలుసుకోవాలనుకున్నా. పోలీసుల నిఘా తీవ్రంగా ఉండటంతో ఇబ్బంది పడుతుందనుకున్నా. చెప్పినట్టే ఓ రహస్య ప్రదేశానికి వచ్చింది. అప్పుడూ ఆమె ఒట్టి చేతులతో రాలేదు. నాకు ఇష్టమని గోధుమ రొట్టెలు, టీ తీసుకుని వచ్చింది. టీలో ఆ రొట్టెలు ముంచుకుని తినడం.. అప్పుడు అక్క ఆప్యాయంగా చూడటం.. ఆ తర్వాత నన్ను కౌగిలించుకుని భోరున ఏడ్వటం ఇప్పటికీ మరచిపోలేను. అప్పుడు రాఖీ జీవితంలో మరపురానిది.
 
దేవుడికి ముడుపులు కట్టారు
 పోలీసులు అణువణువూ గాలిస్తున్న రోజులవి. అప్పుడప్పుడు కంటపడితే ‘ఏంటిరా ఇది.. నీ బిడ్డల ముఖమైనా చూడవా?’ అని ప్రశ్నించేవాళ్లు. నేను మారాలనే అక్కలే.. బయటవాళ్ల ముందు మాత్రం ‘మా తమ్ముడు ఏం తప్పు చేశాడు?’ అని ప్రశ్నించేవాళ్లు. అజ్ఞాతంలో ఉన్న నేను క్షేమంగా ఉండాలని దేవుళ్లకు ముగ్గురక్కలూ ముడుపులు కట్టేవాళ్లు. ఒకసారి ఔరంగాబాద్‌లో పెద్దక్క రైల్వే స్టేషన్‌లో నన్ను చూసి, ముద్దుపెట్టుకుని, కన్నీళ్లు పెట్టింది.
 
 పాటకు ప్రాణం అనుభవాలే
 ఒకసారి ప్రశాంతంగా గతాన్ని నెమరు వేసుకుంటున్నప్పుడు, కళ్లు చెమర్చిన రాఖీ అనుబంధాలు.. ‘మల్లెతీగకు పందిరి వోలె..’ అనే పాటగా మారాయి. ఆ సమయంలోనే నారాయణమూర్తి తన సినిమా కోసం కదిలించే పాట కావాలన్నారు. ఓ పాఠశాలలో నేను రాసిన పాట విన్నారు. వందేమాతం శ్రీనివాస్ ట్యూన్ కట్టారు. ఆ పాట నారాయణమూర్తిని కదిలించింది. సినిమా విడుదలయ్యాక దాసరి నారాయణరావు భార్య పద్మ ఒక రోజంతా కన్నీరు పెట్టారు. ఊరూవాడా అంతగా కదిలించిన ఆ పాటకు అక్కల మమకారమే ప్రేరణని సగర్వంగా చెబుతాను. అందుకే వాళ్లు కట్టే రాఖీకి వెలకట్టలేమని భావిస్తాను.
 
 నా తమ్ముడికి ఎందరో అక్కాచెల్లెళ్లు:  బాలమణి
 గద్దర్ ప్రపంచానికి పాటై పల్లవించినా.. మాకు మాత్రం పిల్లాడే. నాన్న చెప్పిన అంబేద్కర్ భావాల ప్రభావమో.. గద్దర్‌తో ఉన్న మమకారమో.. ఆ ఆత్మీయత అలా బలపడింది. ఏ చిన్న కష్టమొచ్చినా ఆదుకుంటాడు. కన్నీళ్లు పెడితే ఊరడిస్తాడు. ఇంతకన్నా ఏ అక్కకైనా కావాల్సిందేంటి? ఏటా రాఖీ పండుగకు రావడం అలవాటు. నేనొచ్చేసరికే సిద్ధమవుతాడు. తమ్ముడు అజ్ఞాతంలో ఉన్నప్పుడు రాఖీ కట్టలేదన్న వేదన కలచివేసేది. కానీ గద్దర్‌కు ఎక్కడున్నా అక్కాచెల్లెళ్లు ఉంటారు. నాలాంటి వాళ్లు ఎక్కడో ఒక చోట రాఖీ కట్టే ఉంటారని మనసును ఓదార్చుకునేదాన్ని. ఇప్పుడా ఇబ్బంది లేదు. ఈ జన్మలోనే కాదు.. ఇంకెన్ని జన్మలకైనా నా తమ్ముడు నా చేత, నాలాంటి వాళ్ల చేత రాఖీ కట్టించుకోవాలని కోరుకుంటున్నా.
 - ఫొటోలు: సృజన్‌పున్నా

మరిన్ని వార్తలు