-

మచ్చలు మటుమాయం

21 Oct, 2018 02:01 IST|Sakshi

నున్నటి మృదువైన మోముపైన చిన్నపాటి మొటిమ వస్తే చాలు.. అది పూర్తిగా తగ్గించుకునేంతవరకు శతవిధాలా ప్రయత్నిస్తుంటారు మగువలు. మార్కెట్‌లో దొరికే రకరకాల క్రీమ్స్, లోషన్స్‌ వంటివి ట్రై చేస్తూనే ఉంటారు. అలాంటి వారికోసమే ఈ చిట్కాలు. ముందుగా క్లీనప్, స్క్రబ్‌ వంటివి చేసుకుని ఆవిరి పట్టించుకుని ఫేస్‌ప్యాక్‌ వేసుకుంటే ముఖం కాంతివంతంగా మెరవడంతో పాటు మచ్చలు, మొటిమలు తగ్గిపోతాయి. మరింకెందుకు ఆలస్యం? ఇలా ప్రయత్నించండి. 

కావల్సినవి : క్లీనప్‌ : నిమ్మరసం – పావు టీ స్పూన్, రోజ్‌ వాటర్‌ – పావు టీ స్పూన్, బాదంపాలు – 1 టీ స్పూన్‌ (బాదం పప్పులను నాలుగు గంటల పాటు నానబెట్టి.. కొద్దిగా నీళ్లు వేసుకుని మిక్సీ పట్టుకుని, జ్యూస్‌లా మారిన తర్వాత ఆ మిశ్రమాన్ని వడకట్టుకుని బాదం పాలు తయారు చేసుకోవాలి)
స్క్రబ్‌ : బ్రౌన్‌ సుగర్‌ – 2 టీ స్పూన్లు, అరటి గుజ్జు – 2 టీ స్పూన్ల గంధం – అర టీ స్పూన్‌ (గంధం చెక్క నుంచి నూరి తీసుకోవాలి)
మాస్క్‌ : శనగ పిండి – 1 టీ స్పూన్, కిస్మిస్‌ గుజ్జు – అర టేబుల్‌ స్పూన్‌కొబ్బరి పాలు – 2 టీ స్పూన్లు
తయారీ : ముందుగా నిమ్మరసం, బాదంపాలు, రోజ్‌వాటర్‌ ఒక బౌల్‌లో పోసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు లేదా మూడు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్‌తో క్లీన్‌ చేసుకోవాలి. ఇప్పుడు బ్రౌన్‌ సుగర్, అరటి గుజ్జు, గంధం ఒక బౌల్‌లోకి తీసుకుని బాగా కలుపుకుని మూడు లేదా ఐదు నిమిషాల పాటు స్క్రబ్‌ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు శనగపిండి, కిస్మిస్‌ గుజ్జు, కొబ్బరి పాలు ఒక బౌల్‌లోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో క్లీన్‌ చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. 

మరిన్ని వార్తలు