ఫస్టేషన్‌తో కేసీఆర్ అబద్ధాలు

1 Feb, 2016 04:23 IST|Sakshi
ఫస్టేషన్‌తో కేసీఆర్ అబద్ధాలు

జీహెచ్‌ఎంసీ నేతలతో టెలికాన్ఫరెన్స్‌లో చంద్రబాబు

 సాక్షి, హైదరాబాద్:  గ్రేటర్ హైదరాబాద్‌లో తెలుగుదేశం పార్టీ బలంగా ఉండడాన్ని భరించలేకే తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తన స్థాయిని మరిచిపోయి ఫ్రస్టేషన్‌తో అబద్ధాలాడుతున్నారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో పార్టీకి చెందిన జీహెచ్‌ఎంసీ నేతలు, కార్యకర్తలతో ఆదివారం ఉదయం ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మొన్న ఇక్కడేం పనని తనను ప్రశ్నించిన కేసీఆర్.. నిన్న తన భార్యపై అబద్ధాలు చెప్పారని  చంద్రబాబు అన్నారు.

అసహనం వల్లే ఈ వ్యాఖ్యలన్నారు. టీఆర్‌ఎస్ అధికార దుర్వినియోగాన్ని సమర్ధంగా ఎదుర్కోవాలని కార్యకర్తలకు ఆయన సూచించారు. కేసులకు భయపడాల్సిన పనిలేదని భరోసానిచ్చారు. కేసులు, బెదిరింపుల గురించి ఎప్పటికప్పుడు పార్టీ దృష్టికి తెస్తే అధికారులతో మాట్లాడతామని చెప్పారు. మన కష్టమే మనకు మంచి ఫలితాలను అందిస్తుందని.. ఈ రెండు రోజులు రాత్రింబవళ్లు కష్టపడాలని, ఒక మంచి లక్ష్యం కోసం కలసికట్టుగా పనిచేయాలని వారికి సూచించారు. గ్రేటర్ పరిధిలో ప్రతి ఓటు టీడీపీ, బీజేపీకి అనుకూలంగా వేయించుకునేలా.. వాయిస్ మెసేజ్‌లు ప్రతి ఒక్క ఓటరుకు చేరుకునేలా చూడాలన్నారు. రాబోయే రోజుల్లో టీడీపీ మరింత బలపడటానికి ఈ ఎన్నికలు ఒక అవకాశమని ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పారు.

>
మరిన్ని వార్తలు