భయం.. భయం

4 Jan, 2015 00:52 IST|Sakshi

నగరంలో విస్తరిస్తోన్న థైరాయిడ్
వాతావరణ కాలుష్యం,  పౌష్టికాహార లోపమే కారణం
మూడోవంతు బాధితులు మహిళలే
ఇందులో హైపోథైరాయిడే అధికం
సర్వేలో వెల్లడైన వాస్తవాలు

 
థైరాయిడ్.. ఇప్పుడీ సమస్య గ్రేటర్ నగరాన్ని వణికిస్తోంది. నగర వాసులు తమకు తెలియకుండానే థైరాయిడ్ బారిన పడుతున్నారు. వాతావరణ కాలుష్యం.. హార్మోన్లలో సమతుల్యత లోపించడం, పౌష్టికాహార లోపం వల్ల చాలామంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. బాధితుల్లో మూడోవంతు మంది మహిళలు కావడం ఆందోళన కలిగించే అంశం. నగరంలో హైపోథైరాయిడిజం బాధితులే అధికం. దీన్ని సకాలంలో గుర్తించి చికిత్స పొందితేనే అన్ని విధాలా మేలంటున్నారు వైద్య నిపుణులు.
 నగరంలో చాపకింద నీరులా విస్తరిస్తోన్న థైరాయిడ్‌పై  ప్రత్యేక కథనం..                     
- సాక్షి, సిటీబ్యూరో
 
ఒకప్పుడు మారుమూల గ్రామీణ ప్రాంతా ల్లో మాత్రమే కన్పించే థైరాయిడ్ తాజాగా మెట్రో నగరాలకూ విస్తరించింది. పౌష్టికాహారం, అయోడిన్ లోపం.. వాతావరణ కాలుష్యం వల్ల గ్రేటర్‌లో నేడు అనేకమంది థైరాయిడ్ బారిన పడుతున్నారు. మధుమేహం, గుండె జబ్బులకు కేంద్రంగా ఉన్న హైదరాబాద్ నగరంలో థైరాయిడ్ బాధితుల సంఖ్య రోజు రోజుకు గణనీయంగా పెరుగుతోంది. ఇండియన్ థైరాయిడ్ ఎపిడమిలాజీ వారు నిర్వహించిన సర్వేలో ఆశ్చర్యం కలిగిం చే అంశాలు వెలుగు చూ శాయి. సర్వే ప్రకారం 18 ఏళ్లుపైబడిన వారిలో జాతీయ స్థాయిలో సగటున 10.95% మంది హైపోథైరాయిడ్‌తో బాధపడుతున్నారు. రాష్ట్రస్థాయిలో సగటున హైదరాబాద్‌లో 8.88% మంది ఉండగా ఇందులో మూడోవంతు బాధితులు మహిళలు కావడం ఆందోళన కలిగించే అంశం.
 
ఉత్తరాదిన కోల్‌కత.. దక్షిణాన హైదరాబాద్
 
2012-13లో దేశరాజధాని ఢిల్లీ, ముంబై, కోల్‌కత, బెంగళూర్, అహ్మదాబాద్, గోవా, చెన్నై, హైదరాబాద్‌లో సర్వే నిర్వహించారు. ఎంపిక చేసిన నగరాల్లో థైరాయిడ్ హెల్త్‌క్యాంపులు ఏర్పాటు చేసి బాధితుల నుంచి వివరాలు సేకరించారు. రాష్ట్ర స్థాయిలో పరిశీలిస్తే.. దేశంలోనే అత్యధికంగా ఉత్తర భారత దేశంలోని కోల్‌కతలో 21.6 శాతం, దేశ రాజధాని న్యూఢిల్లీలో 11.07 శాతం, అహ్మదాబాద్‌లో 10.6, ముంబైలో 9.6 శాతం ఉండగా, దక్షిణాది నగరాల్లో అత్యధికంగా హైదరాబాద్‌లో 8.88 శాతం బాధితులు ఉన్నట్టు తేలిందని ఉస్మానియా జనరల్ ఆస్పత్రి ఎండోక్రానాలాజీ విభాగం వైద్యుడు డాక్టర్ రాకేష్‌సహాయ్ స్పష్టం చేశారు. పౌష్టికాహార, అయోడిన్ లోపం, వాతావరణ కాలుష్యం, మానసిక ఒత్తిడే దీనికి ప్రధాన కారణమంటున్నారు.
 
కాలుష్యం వల్లే...
 
శరీరంలో అయోడిన్ మూలక లోపం వల్ల థైరాయిడ్ వస్తుంది. 2004కు ముందు ఎక్కువ మంది ఇదే కారణంతో థైరాయిడ్ బారిన పడే వారు. నగరంలో ఇప్పుడా పరిస్థితి లేదు. 90 శాతం మంది తమ ఆహారంలో అయోడిన్ ఉప్పునే వాడుతున్నారు. అంతేకాకుండా భారత్‌ను ఎప్పుడో అయోడిన్ లోపాన్ని అధిగమించిన దేశంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. కానీ వాతావరణ కాలుష్యం, మానసిక ఒత్తిడి వల్ల అనేకమంది దీని బారిన పడుతున్నట్టు తేలింది.  థైరాయిడ్‌ను సకాలంలో గుర్తించి మందులు వాడితే కొంతవరకు కాపాడుకోవచ్చు.- డాక్టర్ రాకేష్ సహాయ్,  ఉస్మానియా జనరల్ ఆస్పత్రి
 
  హైపో థైరాయిడిజం లక్షణాలు    హైపర్ థైరాయిడిజం లక్షణాలు
 
హైపో థైరాయిడ్‌ను సులభంగా గుర్తించవచ్చు    - హైపర్ థైరాయిడ్‌ను కూడా గుర్తించవచ్చు
బరువు పెరగడం            - బరువు తగ్గడం
జుట్టు రాలిపోతుంది         - విపరీతమైన చమట
చర్మం పొడిబారుతుంది     - గుండె వేగంగా కొట్టుకోవడం
విపరీతమైన అలసట        - టెన్షన్(ఆందోళన), చేతులు వణకడం
మహిళల్లో రుతుచక్ర క్రమం తప్పడం    - గుర్తించడంలో రోగులే కాదు
వైద్యులు కూడా పొరపాటు పడవచ్చు  సంతాన లేమి    - టీఎస్‌హెచ్ టెస్టు చేస్తే ఉందో లేదో తెలుస్తుంది
 
 థైరాయిడ్ అంటే..?
 
థైరాయిడ్ అనేది రెండు రకాలు. ఒకటి హైపర్ థైరాయిడిజం, మరొకటి హైపోథైరాయిడిజం. గొంతు భాగంలో ఉన్న థైరాయిడ్ గ్రంథి టి3, టి4 అనే రెండు రకాల హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఇవి శరీర ఎదుగుదలకు ఉపయోగపడటంతోపాటు అవయవాల పనితీరును మెరుగు పరుస్తుంది. శరీర ఉష్ణోగ్రతలను సమతుల్యంగా ఉంచుతుంది. ఈ గ్రంథి సరిగా విధులు నిర్వహించనప్పుడు సమస్య ఏర్పడుతోంది. అవసరం కంటే అధికంగా హార్మోన్లను ఉత్పత్తి చేసినప్పుడు అది హైపర్ థైరాయిడిజమ్‌కు దారితీస్తుంది. ప్రస్తుతం నగరంలో హైపోథైరాయిడిజం బాధితులు అధికంగా ఉన్నారు.
 

 

మరిన్ని వార్తలు