హరితహారానికి సర్కార్ సిద్ధం

4 Jul, 2016 03:38 IST|Sakshi
హరితహారానికి సర్కార్ సిద్ధం

- 8 నుంచి మొక్కలు నాటే ప్రక్రియ మొదలు
- నేడు సీఎస్‌తో మంత్రులు, అధికారుల సమావేశం
- రాష్ట్రవ్యాప్తంగా 46 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యం
 
 సాక్షి, హైదరాబాద్ : ఆకుపచ్చ తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం హరితహారానికి సిద్ధమవుతోంది. 8న మొదలయ్యే ‘తెలంగాణకు హరితహారం’ రెండు వారాలపాటు సాగనుంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇటీవల అన్ని శాఖల అధిపతులతో సమావేశమై హరితహారంపై దిశానిర్దేశం చేయడం తెలిసిందే. ఈ మేరకు జిల్లాలు, మండలాలవారీగా నాటనున్న మొక్కల వివరాలను కలెక్టర్లు ఇప్పటికే ప్రభుత్వానికి పంపారు. రాష్ట్రంలోని 4,213 నర్సరీల నుంచి 199 రకాలకు చెందిన 46 కోట్ల మొక్కలను ఆయా శాఖలకు పంపిణీ చేసే ప్రక్రియ మొదలైంది. సీఎం ఆదేశాల మేరకు హరితహారంపై సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఆధ్వర్యంలో మరోసారి సమావేశం జరగనుంది. అటవీ, మున్సిపల్, పంచాయతీరాజ్ , వ్యవసాయ, నీటిపారుదల, ఆర్ అండ్ బీ శాఖల మంత్రులూ ఈ సమావేశంలో పాల్గొననున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ నెల 11న ఒక్కరోజే 25 లక్షల మొక్కలు నాటేందుకు జీహెచ్‌ఎంసీ సిద్ధమవుతోంది.

 దేశంలోనే రికార్డు దిశగా : హరితహారం పథకంలో భాగంగా 2015లో 40 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ వర్షాభావ పరిస్థితుల కారణంగా 16 కోట్ల మొక్కలనే నాటింది. అయితే ఈ ఏడాది అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రజల భాగస్వామ్యంతో 46 కోట్ల మొక్కలు నాటాలనే సంకల్పంతో ఉంది. సీఎం చొరవ నేపథ్యంలో 46 కోట్ల మొక్కలు నాటి దేశంలోనే రికార్డు సాధించనుంది.
 ‘నక్షత్రాలు, రాశుల’ మొక్కలకు డిమాండ్: హరితహారంలో సకలజనులను భాగస్వాములను చేసేందుకు జన్మ నక్షత్రాలు, రాశుల ఆధారంగా మొక్కలను సరఫరా చేయాలని కేసీఆర్ అధికారులను ఆదేశించిన నేపథ్యంలో ఆయా రకాల మొ క్కలకు డిమాండ్ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మామిడి, సపోటా, అల్ల నేరేడు, జామ వంటి పండ్ల మొక్కలకూ డిమాండ్ ఉంటుందంటున్నారు.

 హరితహారం ప్రాథమిక ప్రణాళిక
► పంచాయతీరాజ్, మున్సిపల్, రాష్ట్ర, జాతీయ రహదారుల పక్కన 2,144 కి.మీ మేర మొక్కలు నాటడం
► ఆర్టిఫిషియల్ రీ జనరేషన్(ఏఆర్) కింద 632 అటవీ ప్రాంతాల్లోని 11,360 హెక్టార్లలో 1.89 కోట్ల మొక్కల పెంపకం
► అసిస్టెడ్ నేచురల్ జనరేషన్ (ఏఎన్‌ఆర్) ప్రణాళికలో భాగంగా కుంచించుకుపోయిన 364 అటవీ ప్రాంతాల్లో 33,851 హెక్టార్ల మేర 1.35 కోట్ల మొక్కల పెంపకం
► 2 వేల కి.మీ మేర కందకాల తవ్వకం, ఇతర ప్రాంతాల్లో 1.30 కోట్ల మొక్కలు నాటడం, గ్రామాల్లో సర్పంచుల అధ్యక్షతన ఏర్పాటైన గ్రామ హరిత రక్షణ కమిటీల ద్వారా మొక్కల పంపిణీ, పెంపకం, సంరక్షణ

 ఇవీ లక్ష్యాలు...
► రాష్ట్రంలో ప్రస్తుతమున్న 24% పచ్చదనాన్ని మూడేళ్లలో 33 శాతానికి పెంచడం
► మూడేళ్లలో 230 కోట్ల మొక్కలు నాటడం (ఏటా 40 కోట్ల చొప్పున మూడేళ్లపాటు 120 కోట్ల మొక్కలు, అటవీ ప్రాంతాల్లో మరో 100 కోట్ల మొక్కలు, జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 10 కోట్ల మొక్కలు)

మరిన్ని వార్తలు