ఎప్పటిలోగా ఏర్పాటు చేస్తారు?

17 Aug, 2017 02:34 IST|Sakshi
రుణరైతు విమోచన కమిషన్‌పై రాష్ట్ర సర్కార్‌ను ప్రశ్నించిన హైకోర్టు
 
సాక్షి, హైదరాబాద్‌: రైతు రుణ విమోచన కమిషన్‌ను ఎప్పటిలోగా ఏర్పాటు చేస్తారో నిర్ధిష్టంగా తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రైతు రుణ విమోచన కమిషన్‌ను ఏర్పాటు చేయకపోవడాన్ని సవాల్‌ చేస్తూ బీజేపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ఇంద్రసేనారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేసింది. రుణాల ఊబిలో కూరుకుపోయిన రైతులు వాటిని తిరిగి చెల్లించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో 2016 మే 27న రాష్ట్ర రుణ విమోచన కమిషన్‌ చట్టాన్ని తెచ్చిందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వై.బాలాజీ గుర్తుచేశారు.

వ్యవసాయ కూలీలు, సన్నకారు రైతులు, గ్రామీణ చేతివృత్తుల నిపుణుల రక్షణ కోసం తెచ్చిన ఆ చట్టం ప్రకారం కమిషన్‌ను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఇప్పటికే కొంతమేర జాప్యం జరిగినమాట వాస్తవనేని, కమిషన్‌ ఏర్పాటుకు కొంత సమయం కావాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్‌.శరత్‌కుమార్‌ కోరారు. హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి అధ్యక్షతన ఏర్పాటుకు చర్చలు జరుగుతున్నాయని, ఈ దశలో వివరాలు వెల్లడించలేమని, 2 వారాల గడువిస్తే పూర్తి వివరాలు అందజేస్తామన్నారు. ఎంత గడువులోగా కమిషన్‌ను ఏర్పాటు చేస్తారో నిర్ధిష్టంగా తెలపాలని కోరిన ధర్మాసనం.. చట్టం ప్రకారం కమిషన్‌ను ఏర్పాటు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. 
మరిన్ని వార్తలు