కన్ఫర్డ్ ఐపీఎస్ల పదోన్నతులపై సర్కారు, పోలీస్ శాఖ నిర్లక్ష్యం
సచివాలయం, డీజీపీ ఆఫీస్ మధ్య చక్కర్లు కొడుతున్న ఫైలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీస్ శాఖలో కన్ఫర్డ్ ఐపీఎస్ల పదోన్నతిపై సందిగ్ధం ఇంకా వీడలేదు. మూడు నెలలుగా సచివాలయం, డీజీపీ కార్యాలయం చుట్టూ ప్రతిపాదన ఫైలు చక్కర్లు కొడుతూనే ఉంది. కన్ఫర్డ్ ఐఏఎస్ల జాబితాతో పాటు 2 నెలల క్రితమే హస్తిన వెళ్లాల్సిన కన్ఫర్డ్ ఐపీఎస్ జాబితా ఎందుకు పెండింగ్లో ఉందో ఉన్నతాధికారు లు సమాధానం చెప్పలేకపోతున్నారు.
రాష్ట్ర విభజన తర్వాత పోస్టులు తక్కువగా ఉన్నాయని, పెంచాలని రాష్ట్రం కోరడంతో మరో 26 పోస్టులు పెంచుతూ కేంద్రం ఉత్తర్వులిచ్చింది. అయితే పోస్టులకు తగిన సంఖ్యలో అధికారులు లేక పోలీస్ శాఖ తీవ్ర ఒత్తిడిలో పడింది. ఉన్న అధికారులపైనే అదనపు భారం పడటంతో తంటాలు పడుతున్నారు. ఐపీఎస్ అధికారుల కొరత తీర్చేందుకు కన్ఫ ర్డ్ మార్గం ఉన్నా అటు అధికారులు, ఇటు ప్రభుత్వ పెద్దలు పట్టించుకోవడం లేదు.
ప్రస్తుతం ఏడుగురు..
రాష్ట్రంలో కన్ఫర్డ్ ఐపీఎస్ కింద పదోన్నతి పొందాల్సిన అధికారులు ప్రస్తుతం ఏడుగురున్నారు. గ్రూప్–1 (2007) ద్వారా డీఎస్పీ గా ఉద్యోగం పొందిన వీరు.. ప్రస్తుతం నాన్క్యాడర్ ఎస్పీ హోదాలో పనిచేస్తున్నారు. ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తి చేసి, ఎలాంటి క్రమ శిక్షణ చర్యలు లేకుండా ఉన్న వీరి జాబితాను కేంద్రానికి పంపాల్సి ఉంది. అయితే డీఎస్పీ ల సీనియారిటీ వివాదం పెండింగ్లో ఉండటంతో జాబితాపై సందిగ్ధం ఏర్పడిం ది. సమస్య తీర్చకుండా రెండు రాష్ట్రాల పోలీస్ శాఖలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపణలున్నాయి.
కన్ఫర్డ్ ఐఏఎస్ అధికారులకూ ఇదే సమస్య ఉన్నా, రెండు రాష్ట్రాల రెవెన్యూ అధికారులు కూర్చొని పరిష్కరిం చుకున్నారని.. రెండు రాష్ట్రాల డీజీపీలు కూడా త్వరితగతిన సమస్యను పరిష్కరించాలని బా«ధిత అధికారులు కోరుతున్నారు. మూడేళ్లుగా కన్ఫర్డ్ ప్యానల్ పెండింగ్లో పడుతూ వస్తోందని, ఈ ప్యానల్ ఇయర్ అయినా తమకు న్యాయం చేసి సర్వీసు కోల్పోకుండా చూడాలని విన్నవిస్తున్నారు.