ప్రెస్‌క్లబ్ అధ్యక్షునిగా రాజమౌళి

23 May, 2016 04:19 IST|Sakshi
హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు బి.రాజమౌళిచారి, ప్రధాన కార్యదర్శి ఎస్.విజయ్‌కుమార్‌రెడ్డి.

- ప్రధాన కార్యదర్శిగా విజయ్‌కుమార్‌రెడ్డి ఎన్నిక

సాక్షి, హైదరాబాద్:
హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ అధ్యక్షునిగా బి.రాజమౌళిచారి, ప్రధాన కార్యదర్శిగా ఎస్.విజయ్‌కుమార్‌రెడ్డి(సాక్షి) ఎన్నికయ్యారు. ఆదివారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ ఎన్నికలు సోమాజిగూడ లో రసవత్తరంగా సాగాయి. తదనంతరం ఓట్లను లెక్కించారు. రాజమౌళిచారి తన సమీప ప్రత్యర్థి వాసిరెడ్డి శ్రీనివాస్‌పై 33 ఓట్ల తేడాతో గెలుపొందారు. చారికి 230 ఓట్లు పోలవ్వగా.. శ్రీనివాస్‌కు 197 ఓట్లు దక్కాయి.

జనరల్ సెక్రెటరీ పదవికి ముగ్గురు అభ్యర్థులు బరిలో నిలవగా ఎస్.విజయ్‌కుమార్‌రెడ్డి ఘనవిజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి పీవీ శ్రీనివాస్(టీన్యూస్)పై 85 ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపొందారు. విజయ్‌కుమార్‌రెడ్డికి 330, శ్రీనివాస్‌కు 245 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 992 ఓటర్లకుగానూ 697 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉపాధ్యక్షులుగా ఇ.జనార్దన్ రెడ్డి, గాయత్రి, కోశాధికారిగా ఎన్.శ్రీనివాస్‌రెడ్డి, జాయింట్ సెక్రెటరీలుగా దుగ్గు రఘు, రమేశ్ వైట్ల ఎన్నికయ్యారు.

ఈసీ మెంబర్లుగా..
సరస్వతి రమ, యశోద ఏకగ్రీవం కాగా, కె.కృష్ణ, అనిల్‌కుమార్, హరిప్రసాద్, ఈ.నరేందర్, గంగాధర్, వసంత్‌కుమార్, రాజేశ్, శ్రీనివాస్ కస్తూరీ తదితరులు పాలకమండలి సభ్యులుగా ఎన్నికయ్యారు.

మరిన్ని వార్తలు