చంద్రబాబు అంటే వారికి భయం తగ్గింది: జేసీ

21 Dec, 2015 14:13 IST|Sakshi

హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ప్రతిష్ట తగ్గిందని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. చంద్రబాబు అంటే అధికారులకు అస్సలు భయం లేకుండా పోయిందని, ఆయన కొరడా ఝుళిపించాలని అన్నారు. లేదంటే రాష్ట్రం ఇబ్బందుల్లో పడుద్దని హెచ్చరించారు. టీడీపీ ఎంపీ అయిన జేసీ తనలో ఇంకా కాంగ్రెస్ రక్తమే ప్రవహిస్తుందని అన్నారు. అసెంబ్లీలో బిల్లులు పాస్ చేయించుకోవడమే ప్రభుత్వం పనిగా పెట్టుకుందని జేసీ అన్నారు. అటు పార్లమెంటులో.. ఇటు అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చకు రావడం లేదని అసహనం వ్యక్తం చేశారు.

ప్రతిపక్షం సమన్వయంతో వ్యవహరించి ప్రజా సమస్యలు సభలో చర్చకు వచ్చేలా చూసుకోవాలని అన్నారు. గతంతో పోలిస్తే రాజకీయాలు స్వచ్ఛందంగా లేవని, కలుషితమయ్యాయని చెప్పారు. ప్రభుత్వాలు సహకరించకపోతే తెలివిగా వ్యవహరించాలని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రతిపక్షాలు జనాలకు చెప్పలేకపోతున్నాయని వివరించారు. కాల్ మనీ అనేది అనాదిగా ఉందని, అధిక వడ్డీలు లేకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం కూడా చెప్పిందని, మనమే కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవాలని అన్నారు. రాయలసీమకు మూడు నామాలు తప్ప.. అభివృద్ధి లేదని అర్థమైందని చెప్పారు.

మరిన్ని వార్తలు