భారత ఎంబసీ పేరిట భారీ మోసాలు

5 Mar, 2018 20:31 IST|Sakshi
వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయం

వాషింగ్టన్‌ : భారత​ ఎంబసీ పేరిట భారీగా మోసాలకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నారైల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. పలువురి ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి రాగా.. అత్యున్నత దర్యాప్తునకు భారత రాయబారి కార్యాలయం ఆదేశించింది.  

వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయం పేరిట కొందరు ఫేక్‌ కాల్స్‌ చేస్తూ ప్రజలను ఏమారుస్తున్నారు. పాస్‌ పోర్టులో పోరపాట్లు ఉన్నాయని, వీసా ఫామ్స్‌, ఇమ్మిగ్రేషన్‌ ఫామ్‌లకు సంబంధించిన వ్యవహారాల పేరిట ఆ ఫోన్‌ కాల్స్‌ వచ్చినట్లు బాధితులు చెబుతున్నారు. మరికొందరి నుంచైతే క్రెడిట్‌ కార్డులకు సంబంధించిన విషయాలు కూడా ఆరాతీసినట్లు తెలుస్తోంది. వీసా దరఖాస్తు దారులకు కూడా ఈ తరహా కాల్స​ వచ్చినట్లు సమాచారం. భారత రాయబార కార్యాలయం నంబర్ల నుంచే ఆ కాల్స్‌ రావటంతో బాధితులు కూడా అదంతా నిజమే అని నమ్మేశారు. వారు చెప్పినట్లు అకౌంట్‌లో డబ్బును జమ చేశారంట. 

ఫిర్యాదులు వెల్లువెత్తటంతో ఈ వ్యవహారాన్ని భారత రాయబార కార్యాలయం సీరియస్‌గా తీసుకుంది. విషయాన్ని యూఎస్‌ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లిన భారత ఎంబసీ ఓ ప్రకటన విడుదల చేసింది. తమ అధికారులేవరూ వ్యక్తిగత సమాచారంపై అలాంటి ఫోన్లు చెయ్యరని.. అమెరికాలో ఉన్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. బాధితులు డబ్బును జమ చేసిన అకౌంట్‌ నంబర్ల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది. ఈ తరహా మోసాలు జరగటం ఇదే మొదటిసారి అయి ఉండొచ్ఛని ఎంబసీ భావిస్తోంది.

మరిన్ని వార్తలు