భారత డైరీ మార్కెట్‌లోకి అమెరికా ఎంట్రీ..

14 Feb, 2020 08:35 IST|Sakshi

న్యూఢిల్లీ/వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌ పర్యటన సందర్బంగా మన పౌల్ర్టీ, డైరీ మార్కెట్లలో అమెరికన్‌ కంపెనీలకు పాక్షిక వాణిజ్యానికి అనుమతించేందుకు మోదీ సర్కార్‌ సంసిద్ధమైంది. ప్రపచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా ఉన్న భారత్‌ సంప్రదాయంగా పాలు, పాల సంబంధిత ఉత్పత్తుల దిగుమతులపై నియంత్రణలు విధిస్తోంది. డైరీ పరిశ్రమపై 8 కోట్లకు పైగా గ్రామీణ కుటుంబాలు జీవనోపాధి పొందుతుండటంతో వీరికి ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా డైరీ రంగంలో దిగుమతులను దశాబ్ధాలుగా నియంత్రిస్తోంది. అయితే భారత్‌-అమెరికా వాణిజ్య బంధాన్ని బలోపేతం చేసేందుకు ఈ పరిమితులను పాక్షికంగా సడలించేందుకు నరేంద్ర మోదీ సర్కార్‌ సన్నద్ధమైందన్న ప్రచారం సాగుతోంది.

కాగా స్టెంట్లు వంటి వైద్య పరికరాల ధరలపై ప్రధాని మోదీ నియంత్రణలు విధించడం, ఈకామర్స్‌ నియంత్రణలు, న్యూ డేటా లోకలైజేషన్‌ వంటి పరిమితుల నేపథ్యంలో 2019లో ట్రంప్‌ ప్రభుత్వం భారత్‌కు ప్రత్యేక వాణిజ్య హోదాను తొలగించిన క్రమంలో అమెరికాతో వాణిజ్య బంధాన్ని బలోపేతం చేసేందుకు మోదీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. ట్రంప్‌ భారత్‌ పర్యటన నేపథ్యంలో దిగుమతి సుంకాల తగ్గింపు, రాయితీలు ప్రకటిస్తే కొన్ని ఉత్పత్తులపై భారత్‌కు ఈ హోదాను పునరుద్ధరించవచ్చని భావిస్తున్నారు. అమెరికా నుంచి చికెన్‌ లెగ్స్‌ దిగుమతులకు అనుమతితో పాటు భారత్‌ తాజాగా 5 శాతం టారిఫ్‌, కోటాలతో డైరీ మార్కెట్‌లోకీ అమెరికాను అనుమతించేందుకు సిద్ధమైంది. డైరీ మార్కెట్‌లోకి అమెరికాను ఆహ్వానిస్తే గ్రామీణ రంగంలో రైతులతో పాటు పాడిపరిశ్రమపై ఆధారపడిన కుటుంబాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

చదవండి : వెల్‌కమ్‌ ట్రంప్‌..గోడచాటు పేదలు

మరిన్ని వార్తలు