గాయాలు మానేందుకు సరికొత్త చికిత్స

11 Aug, 2017 20:12 IST|Sakshi
గాయాలు మానేందుకు సరికొత్త చికిత్స

న్యూయార్క్‌: పలు కారణాల వల్ల మానవ శరీరంపై ఏర్పడే గాయాలను అతి త్వరగా నయం చేసేందుకు శాస్త్రవేత్తలు కొత్త చికిత్సా విధానాన్ని కనుగొన్నారు. సాంకేతిక పరిభాషలో టిష్యూ నానోట్రాన్స్‌ఫెక్షన్‌ (టీఎన్‌టీ)గా వ్యవహరించే ఈ చికిత్సా విధానాన్ని అమెరికాలోని ఒహాయో స్టేట్‌ యూనివర్శిటీ పరిశోధకులు కనుగొన్నారు. గాయాల కారణంగా దెబ్బతిన్న జన్యు కణాలను రీప్రోగ్రామింగ్‌ చేయడమే ఈ కొత్త చికిత్సా విధానం.

గాయపడిన చోట చర్మానికి ఎలక్ట్రికల్‌ స్టిములేషన్‌ కలిగిస్తారు. అనంతరం చొక్కా బటన్‌ సైజులో ఉండే ఓ చిప్‌ను గాయమైన చోటుకు పంపిస్తారు. అది వెంటనే డీఎన్‌ఏ లేదా ఆర్‌ఎన్‌ఏలో ముందుగా చేసిన ప్రోగ్రామ్‌ ద్వారా దెబ్బతిన్న కణాలను రీప్రోగ్రామ్‌ చేస్తుంది. సజీవ కణాలకు ఎలాంటి హాని కలిగించకుండా డాక్టర్ల ఆదేశాల మేరకు ఈ చిప్‌లో ముందస్తు ప్రోగ్రామ్‌ ఉంటుందని పరిశోధకులు తెలిపారు. ఎలుకల్లో చనిపోయిన జన్యు కణాలను ప్రాణం తెప్పించేందుకు, దెబ్బతిన్న అవయవాలను తిరిగి పెరిగేలా చేయడం కోసం ఈ సరికొత్త చికిత్సా విధానాన్ని అమలు చేసి విజయం సాధించామని పరిశోధకులు తెలిపారు.

మానవులపై ఈ ప్రయోగం చేయడానికి మరో ఏడాది కాలం పట్టవచ్చని పరిశోధకులు తెలియజేస్తున్నారు. అల్జీమర్స్, పార్కిన్సన్, స్ట్రోక్‌తో బాధ పడుతున్నవారికి ఈ చికిత్సా విధానం మంచిది కాకపోవచ్చని, ఆ విషయన్ని కూడా తేల్చుకొని అవసరమైన లైసెన్స్‌లను పొందేందుకు ఏడాది కాలం పడుతుందని భావిస్తున్నట్లు వారు వివరించారు.

మరిన్ని వార్తలు