నాసా గుప్పిట్లో ఆ గ్రహం గుట్టు..!

8 Jan, 2020 18:52 IST|Sakshi

వాషింగ్టన్‌ : అంతరిక్షంలో భూమిని పోలిన నివాసయోగ్యత కలిగిన గ్రహానికి అన్వేషణ సాగించే పరిశోధనలకు ఊతమిచ్చేలా శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. మొదటిసారిగా భూమిని పోలిన పరిమాణం కలిగిన గ్రహాన్ని కనుగొన్నారు. ఈ ప్లానెట్‌లో ద్రవ నీరు ఉనికిని గుర్తించారు. మరొక సానుకూల అంశంగా ఈ గ్రహం మన సౌర వ్యవస్థకు సమీపాన ఉండటం వెలుగులోకి వచ్చింది. నాసాకు చెందిన గ్రహాల అన్వేషణ విభాగం ఇటీవల జరిగిన అమెరికన్ ఆస్ట్రోనామికల్ సొసైటీ సమావేశం సందర్భంగా ఈ వివిరాలు వెల్లడించింది. ఈ గ్రహం మన నుండి 100 కాంతి సంవత్సరాల కన్నా ఎక్కువ దూరంలో లేని ఒక నక్షత్రం (టీఓఐ 700) చుట్టూ తిరుగుతున్నట్టు ప్రకటించింది.

ఈ నక్షత్రం చుట్టూ తిరిగే మూడు గ్రహాల్లో ఈ గ్రహం ఒకటిగా పరిశోధకులు తేల్చారు. అంతరిక్ష పరిశోధన సంస్థ స్పిట్జర్‌ స్పేస్‌ టెలిస్కోప్‌ సాయంతో ఖగోళ శాస్త్రవేత్తలు ఈ గ్రహం సామర్ధ్యాన్నిఅంచనా వేశారు. టీఓఐ 700 అనే గ్రహం ఇతర రెండు గ్రహాలతో పోల్చితే దాని నక్షత్రాన్ని చాలా దూరం నుండి కక్ష్యలో తిరుగుతుంది. ఈ గ్రహంలో ఒక వైపు ఎప్పుడూ పగటి వెలుగు ఉంటుందని గుర్తించారు. గతంలో టీఓఐ 700 గ్రహం  వేడిగా ఉంటుందని భావించారు, వ్యోమగాములు ఈ మూడు గ్రహాలూ మానవులకు నివాస యోగ్యం కాదని భావిస్తున్నా, ఈ గ్రహం భూ మండలంతో సమానంగా ప్రవర్తిస్తుందో లేదో నిర్ణయించలేమని, ఏదో ఒక రోజు, మనకు  ఈ గ్రహం స్పెక్ర్టం లభించినప్పుడు దీని ఆంతర్యాన్ని పసిగట్టవచ్చని, వాటిని దగ్గరి అనుకరణ స్పెక్ట్రమ్‌తో సరిపోల్చవచ్చని నాసా గొడ్దార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్‌ పరిశోధకుడు గాబ్రియెల్ ఎంగెల్మన్ సుయిసా వెల్లడించారు.

మరిన్ని వార్తలు