సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేసిన పాక్‌

28 Feb, 2019 10:31 IST|Sakshi

సాక్షి,  న్యూఢిల్లీ : భారత పైలట్‌ ఇంకా పాకిస్తాన్‌ కస్టడీలో ఉన్నందున ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మరోవైపు భారత్‌- పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేసినట్టు పాకిస్తాన్‌ వెల్లడించింది. లాహోర్‌ నుంచి అతారి వరకూ నడిచే సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ను తదుపరి నోటీసులు ఇచ్చేవరకూ నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. భధ్రతా ఆందోళనల నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని పాకిస్తాన్‌ రైల్వేల అదనపు జనరల్‌ మేనేజర్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

ఇక సరిహద్దుల్లో యుద్ధ మేఘాలతో ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా రెండో రోజూ గురువారం ఉన్నతస్ధాయి సమావేశాలు నిర్వహించనున్నారు. రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు త్రివిధ దళాధిపతులతో బుధవారం సంప్రదింపులు జరిపిన ప్రధాని నరేంద్ర మోదీ గురువారం సైతం కీలక భేటీలు జరపనున్నారు. కాగా సరిహద్దు వెంబడి జమ్మూ కశ్మీర్‌లో పలుచోట్ల పాకిస్తాన్‌ దళాలు కాల్పుల విరమణ ఒప్పందాలను ఉల్లంఘిస్తూ భారత శిబిరాలే లక్ష్యంగా పాక్‌ ముందుకు కదులతోంది. మరోవైపు జైషే చీఫ్‌ మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న భారత్‌ డిమాండ్‌కు అమెరికా, బ్రిటన్‌,ఫ్రాన్స్‌లు బాసటగా నిలిచాయి.

మరిన్ని వార్తలు