Israel-Palestine War: హమాస్‌పై కొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడులు

12 Nov, 2023 18:47 IST|Sakshi

టెల్ అవీవ్: హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులను కొనసాగిస్తోంది. హమాస్ వద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరులను వదిలేవరకు దాడులను ఆపేదని లేదని ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు. ఇప్పటికే ఉత్తరగాజాపై హమాస్ పట్టు కోల్పోయిందని పేర్కొన్నారు. అయితే.. యుద్ధం అనంతరం గాజా పాలన పరిస్థితి ఏంటనేది పెద్ద మిస్టరీగా మారింది. దీనిపై తాజాగా స్పందించిన నెతన్యాహు.. యుద్ధానంతరం గాజాను స్వాధీనం చేసుకుంటామని అన్నారు. దీనిని అమెరికా ఖండిస్తోంది. 

"హమాస్‌పై పోరాటంలో ఇజ్రాయెల్ వెనక్కి తగ్గదు. హమాస్‌ను పూర్తిగా నిర్మూలించాల్సిందే. బందీలును తప్పకుండా కాపాడతాం. అల్-షిఫా ఆస్పత్రిని ఇప్పటికే  ఆక్రమించాం. మా ఆపరేషన్ లక్ష‍్యమే బందీలను విడిపించడం" అని నెతన్యాహు ప్రకటించారు. అయితే.. పశ్చిమాసియా దేశాలు హమాస్‌కు వ్యతిరేకంగా నిలబడాలని ఆయన మరోసారి కోరారు. 

యుద్ధం ప్రారంభమైననాటి నుంచీ గాజాను ఆక్రమించుకునే ఉద్దేశం తమకు లేదని ప్రధాని నెతన్యాహు చెప్పుకొచ్చారు. కానీ తాజాగా గాజా ఇజ్రాయెల్ దళాల ఆధీనంలోనే ఉంటుందని మాట్లాడారు. బహుళజాతి దళాలను అంగీకరించేది లేదని తెగేసి చెప్పారు. గాజా స్వాధీనం దిశగా ఇజ్రాయెల్ అడుగులు  వేస్తున్నట్లు నెతన్యాహు మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. గాజాపై దాడిని ఓ పక్క ప్రపంచదేశాలు కోరుతున్నప్పటికీ ఏ మాత్రం పట్టించుకోకుండా ఇజ్రాయెల్ ముందుకు పోతోంది. గాజా ఆక్రమణ సరైన విధానం కాదని అమెరికా కూడా ఇజ్రాయెల్‌ను హెచ్చరిస్తోంది.     

హమాస్‌ను అంతం చేసే దిశగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. శరణార్థి శిబిరాలపై కూడా రాకెట్ దాడులు చేస్తోంది. మరోవైపు పాలస్తీనాకు మద్దతుగా ఇజ్రాయెల్ పై హెజ్బుల్లా దాడులు చేస్తోంది. శక్తివంతమైన బుర్కాన్ క్షిపణులతో ఇజ్రాయెల్ పై దాడికి దిగింది. 

ఇదీ చదవండి: ట్రూడో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు