బీజింగ్: చైనా మరోసారి తన నోటి దురుసును చూపించింది. మాటల దాడిని పెంచింది. భారత్ తమ గురించి తక్కువ అంచనా వేసుకోవద్దని, భ్రమల్లో ఉండొద్దంటూ చైనా రక్షణశాఖ అధికార ప్రతినిధి వు కియాన్ సోమవారం హెచ్చరించారు. 'పర్వతాన్ని కదిలించడం తేలికేమోగానీ, పీపుల్ లిబరేషన్ ఆర్మీని కదిలించడం మాత్రం చాలా కష్టం' అంటే తమ దేశా ఆర్మీ గురించి బీరాలు పోతూ రెచ్చగొట్టే తీరుగా ఆయన మాట్లాడారు. భారత సైన్యం తమ దేశానికి చెందిన భూభాగం డాంగ్లాంగ్ను దాటిందని, తమ రోడ్డు నిర్మాణ పనులు అడ్డుకుందని ఆరోపించింది.
అదే సమయంలో సిక్కింలోని డోక్లామ్ సరిహద్దు విషయంలో జోక్యం చేసుకున్నారని మండిపడింది. అక్కడ ఉన్న భారత సేనలను వెనక్కి పిలుచుకోవాలని చెప్పగా తాము కూడా చర్చలకు సిద్ధమేనని, అయితే, ఇరు దేశాల సైన్యాలను సమానంగా ఉపసంహరించుకోవాలని భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ డిమాండ్ చేశారు. అయితే, భారత్ మాత్రమే ముందు తన సైన్యాన్ని విరమించుకోవాలని అప్పుడే చర్చలంటూ పట్టుబట్టింది. ఈ సమయంలోనే ఇరు దేశాల మధ్య సందిగ్దతను తొలగించేందుకు అమెరికా ముందుకొస్తుందని ఊహాగానాలు ఊపందుకుంటుండగా చైనా మాత్రం తన రెచ్చగొట్టే చర్యలను మాత్రం కొనసాగిస్తునే ఉంది. భారత్ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూడొద్దని భ్రమల్లో బ్రతకొద్దంటూ రెచ్చగొడుతూ మాట్లాడుతోంది.