రెండు రత్నాలతో కోటీశ్వరుడయ్యాడు

25 Jun, 2020 16:39 IST|Sakshi

టాంజానియా: అదృష్టం ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో ఎవరికీ తెలియదు. టాంజానియాకి చెందిన ఒక వ్యక్తి రాత్రికి రాత్రి కోటీశ్వరుడైపోయాడు. ఏదో లాటరీ తగిలి కాదు, రెండు పెద్ద రత్నాలను విక్రయించి ధనవంతుయ్యాడు. గనులు తవ్వే పని చేసుకుంటూ బతికే లైజర్‌ అనే వ్యక్తికి ముంజేయి పరిమాణంలో ఉండే రెండు రత్నాల రాళ్లు దొరికాయి. వీటిలో మొదటి రత్నం బరువు 9.27 కిలోలు (20.4 పౌండ్లు) కాగా, రెండవ దాని బరువు 5.103 కిలోలు (11.25 పౌండ్లు) ఉన్నాయి. ముదురు వైలెట్-నీలం రంగులో ఉండే ఈ రత్నాలను అతని వద్ద నుంచి ఆ దేశ ప్రభుత్వం దాదాపు 7.74 బిలియన్ టాంజానియన్ షిల్లింగ్స్‌కు కొనుగోలు చేసింది. అంటే వీటి ధర భారతదేశ కరెన్సీలో 25 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. వీటిని దేశంలోని ఉత్తరాన ఉన్న టాంజానిట్ గనులలో లైజర్ కనుగొన్నారు.  

(తెరుచుకున్న ఈఫిల్‌ టవర్‌.. కానీ)

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆ దేశ గనుల మంత్రిత్వ శాఖ శాశ్వత కార్యదర్శి సైమన్‌ మ్సంజిలా మాట్లాడుతూ.. మిరేరానీలో మైనింగ్‌ కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుంచి రెండు అతిపెద్ద టాంజానిట్‌ రత్నాలను గుర్తించడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. ప్రభుత్వం అతని దగ్గర నుంచి రత్నాలను కొనుగోలు చేసే కార్యక్రమాన్ని టాంజానియాలోని ఒక టీవీ ఛానెల్‌లో ప్రసారం చేశారు. టాంజానియా సెంట్రల్‌ బ్యాంక్‌ అతని దగ్గర నుంచి రత్నాలను కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన చెక్కు అందించిన సమయంలో దేశ అధ్యక్షుడు జాన్‌ మాగుఫులీ స్వయంగా ఫోన్‌ చేసి లైవ్‌లో అభినందించారు. మైనింగ్‌ చేసే వారు తమ రత్నాలను, బంగారాన్ని ప్రభుత్వానికి విక్రయించడానికి టాంజానియా ప్రభుత్వం గత ఏడాది దేశవ్యాప్తంగా వాణిజ్య కేంద్రాలను ఏర్పాటు చేసింది. (అక్కడ టూ వీలర్స్‌పై పూర్తి నిషేధం)

మరిన్ని వార్తలు