అధ్యక్షుడికి కోర్టు హెచ్చరిక.. తోసిపుచ్చిన జడ్జి

1 Jul, 2020 10:55 IST|Sakshi

బ్రెసీలియా: బ్రెజిల్‌ అధ్యక్షుడు జెయిర్‌ బొల్సనారో పబ్లిక్‌ మీటింగు‌లలో తప్పక మాస్క్‌ ధరించాలంటూ అక్కడి కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే ఈ తీర్పును ఓ జడ్జి తప్పుపట్టారు. అధ్యక్షుడు మాస్క్‌ ధరించడం తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేయడం అనవసరం అన్నారు. జడ్జి డేనియల్ మారన్హావో కోస్టా మాట్లాడుతూ ‘రాజధాని బ్రెసీలియాలో ఇప్పటికే ఫేస్ మాస్క్‌లు తప్పనిసరి చేశారు. కాబట్టి ఈ ఆర్డర్ అనవసరం. అధ్యక్షుడిని కూడా దేశంలోని ఇతర సామన్య ప్రజల మాదిరిగానే చూడాలి’ అని తెలిపాడు. ఏప్రిల్‌ నుంచి బ్రెజిల్‌లో మాస్క్‌ ధరించడం తప్పని సరి చేశారు. ఈ నియమాన్ని ఉల్లంఘించిన వారికి రెండు వేల రియాలు(రూ.29 వేలు) జరిమానా విధిస్తారు. కాగా గ‌త వారం త‌న ప‌ద‌వికి రాజీనామా చేసిన బ్రెజిల్‌ విద్యాశాఖ మంత్రి మాస్కు ధ‌రించనందుకు రెండు వేల రియాల ఫైన్ క‌ట్టిన విష‌యం తెలిసిందే.(దేశాధ్య‌క్షుడైనా మాస్కు ధ‌రించాల్సిందే: కోర్టు)

అయితే అధ్యక్షుడు జెయిర్ బొల్సనారో మాత్రం ఎప్పటికప్పుడు కరోనా నియమాలను ఉల్లంఘిస్తూనే ఉంటారు. సామాజిక దూరాన్ని పాటించరు. ర్యాలీలలో ప్రజలకు హ్యాండ్‌షేక్‌ ఇవ్వడమే కాక వారిని కౌగిలించుకుంటారు. మాస్క్‌ ధరించకుండ బార్బక్యూలను నిర్వహించడం, హాట్‌ డాగ్‌ల కోసం బయటకు వెళ్లడం వంటివి చేస్తారు. అంతేకాక బొల్సనారో మొదట్లో కరోనా వైరస్‌ను  సాధారణ ఫ్లూతో పోల్చారు. వైరస్‌ను అరికట్టేందుకు క్వారంటైన్, సామాజిక దూరం పాటించాలంటూ గవర్నర్లు, మేయర్లు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించారు. వారు దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్య​క్తం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కరోనా కేసుల్లో బ్రెజిల్‌ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్నది. (3 కేసులు...3 లక్షలు)

>
మరిన్ని వార్తలు