యమలీలకు పాతికేళ్లు

28 Apr, 2019 01:49 IST|Sakshi
కిశోర్‌ రాఠి, అలీ

కమెడియన్‌ అలీ టాప్‌ ఫామ్‌లో కొనసాగుతున్న సమయంలో అలీని హీరోగా పరిచయం చేస్తూ ఎస్వీ కృష్ణారెడ్డి రూపొందించిన చిత్రం ‘యమలీల’. కిశోర్‌ రాఠి సమర్పణలో కె. అచ్చిరెడ్డి నిర్మించిన ఈ చిత్రం నేటితో (ఏప్రిల్‌ 28) పాతికేళ్లు పూర్తి చేసుకుంది. తల్లీ కొడుకుల సెంటిమెంట్‌తో రూపొందిన ఈ సినిమాలో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు నిండి ఉండటం చిత్రవిజయానికి ఓ కారణం. తల్లిగా మంజు భార్గవి, యమధర్మరాజుగా కైకాల సత్యనారాయణ, చిత్రగుప్తుడు పాత్రలో బ్రహ్మానందం, తోట రాముడిగా తనికెళ్ల భరణి ఇలా సినిమాలో ప్రతి పాత్రా ఇప్పటికీ గుర్తుండిపోయే విధంగా ఉంటుంది. ‘నీ జీనూ ప్యాంటు చూసి బుల్లోడో..’, సిరులొలికించే చిన్ని నవ్వులే..., జుంబారే జుంజుంబారే...’ పాటలు హైలైట్‌. సూపర్‌ స్టార్‌ కృష్ణ, ఇంద్రజ  ఓ స్పెషల్‌ సాంగ్‌ చేయడం స్పెషల్‌ అట్రాక్షన్‌. రిలీజ్‌ అయిన కొన్ని కేంద్రాల్లో ఏడాది పాటు ఏకధాటిగా ప్రదర్శితం అవ్వడం విశేషం. అలా ‘యమలీల’ అలీ కెరీర్‌లో ఓ మరపురాని చిత్రంగా నిలిచిపోతుంది.

మరిన్ని వార్తలు