వీళ్లకి టీవీయే కరెక్ట్‌ అని మాత్రం అనుకోరు

4 Feb, 2020 00:16 IST|Sakshi
రాంప్రసాద్‌

‘‘త్రీ మంకీస్‌’ సినిమా టైటిల్‌కి తగ్గట్టే ఈ సినిమాలో నేను, సుధీర్, గెటప్‌ శ్రీను కోతి చేష్టలు చేస్తుంటాము’’ అన్నారు రాంప్రసాద్‌. ‘జబర్దస్త్‌’ ఫేమ్‌ సుధీర్, గెటప్‌ శ్రీను, రాంప్రసాద్‌ ముఖ్య పాత్రల్లో నటించిన∙చిత్రం ‘త్రీ మంకీస్‌’. జి. అనిల్‌ కుమార్‌ దర్శకత్వంలో జి. నగేశ్‌ నిర్మించారు. ఈ నెల 7న ఈ సినిమా విడుదల కానున్న సందర్భంగా రాంప్రసాద్‌ మాట్లాడుతూ – ‘‘ఇండస్ట్రీకి రావాలనే కోరిక ఎప్పటినుంచో ఉంది. గలగల మాట్లాడుతూ, పంచ్‌లు వేస్తుంటే చుట్టుపక్కల వాళ్లు ‘నువ్వు ఇండస్ట్రీలో ఉండాల్సినవాడివి’ అనేవారు. దాంతో లగేజ్‌ సర్దుకుని హైదరాబాద్‌ వచ్చేశాను (నవ్వుతూ).

కానీ ఇక్కడ పరిస్థితులు వేరేలా ఉన్నాయి. ఎంతో  స్ట్రగులయ్యాక ‘జబర్దస్త్‌’ టీవీ షో మంచి బ్రేక్‌ ఇచ్చింది. ఆ షో ద్వారా ‘ఆటో రాంప్రసాద్‌’గా పాపులరయ్యాను. ‘త్రీ మంకీస్‌’ కథ నచ్చి మేం సినిమా చేయాలనుకున్నాం. సరదాగా సాగిపోయే ముగ్గురు స్నేహితులకు ఒక సమస్య ఎదురవుతుంది. అందులో నుంచి ఎలా బయటపడ్డారు అన్నది కథాంశం. థియేటర్‌కి వచ్చిన ప్రేక్షకులను కచ్చితంగా ఎంటర్‌టైన్‌ చేస్తాం. ‘త్రీ మంకీస్‌’ చూసి వీళ్లకి టీవీయే కరెక్ట్‌ అని మాత్రం అనుకోరని చెప్పగలను. టీవీని, సినిమాను బ్యాలెన్స్‌ చేస్తూ పని చేయాలనుకుంటున్నాను. దర్శకత్వం చేసే ఆలోచనలు కూడా ఉన్నాయి’’ అన్నారు.

మరిన్ని వార్తలు