ఐష్‌ ఏమంటుందో తెలుసా?

6 Aug, 2019 07:54 IST|Sakshi

సినిమా: నటుడు అజిత్‌ కోలీవుడ్‌ స్టార్‌. నటి ఐశ్వర్యారాయ్‌ బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌. అయితే వీరిద్దరికి పరిచయం ఒక్క చిత్రంలో జరిగింది. అదే కండుకొండేన్‌ కండుకొండేన్‌. రాజీవ్‌మీనన్‌ తెరకెక్కించిన ఆ చిత్రం విడుదలై కొన్నేళ్లు అయ్యింది. ఆ చిత్రంలో అజిత్, ఐశ్వర్యారాయ్‌ జంటగా నటించలేదు. అయినా ఇప్పుడు సడన్‌గా నటి ఐశ్వర్యారాయ్‌ అజిత్‌ను పొగడ్తలతో ముంచెత్తుతోంది. ఇటీవల చెన్నైలో మెరిసిన ఈ సుందరి దర్శకుడు మణిరత్నం, నటుడు అజిత్‌ల గురించి చాలా విషయాలు చెప్పుకొచ్చింది. బాలీవుడ్‌లో నటిస్తున్నా, దక్షిణాదిలో తమిళం తప్ప ఇతర భాషల్లో నటించడానికి ఇష్టపడని నటి ఐశ్వర్యారాయ్‌. కోలీవుడ్‌ చిత్రాల్లో నటించడానికి కారణం దర్శకుడు మణిరత్నం అన్నది అందరికి తెలిసిందే. ఐష్‌ను కోలీవుడ్‌కు పరిచయం చేసింది ఈ దర్శకుడే. అందుకే ఆయనంటే ఈమెకు గౌరవం. త్వరలో మణిరత్నం తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్న భారీ చారిత్రక కథా చిత్రం పొన్నియన్‌ సెల్వన్‌లో ఈ మాజీ ప్రపంచ సుందరి కూడా ఉన్నారు.

దీని గురించి ఐష్‌ మాట్లాడుతూ.. మణిరత్నం దర్శకత్వంలో పొన్నియన్‌ సెల్వన్‌ చిత్రంలో నటించనున్నానని తెలిపింది. మణిరత్నంతో కలిసి చాలా కాలంగా సినీ పయనం చేస్తున్నాననీ, ఆయనతో పనిచేయడం గొప్పగా భావిస్తున్నానని చెప్పింది. ఆయన తన గురువని పేర్కొంది. తగిన సమయంలో మణిరత్నమే ఆ చిత్ర వివరాలను వెల్లడిస్తారని చెప్పింది. నటుడు అజిత్‌ గురించి మీ అభిప్రాయం ఏమిటని అడుగుతున్నారనీ, ఆయన చాలా సౌమ్యుడు అని పేర్కొంది. ఇంకా చెప్పాలంటే చాలా గొప్ప వ్యక్తి అని అంది. అభిమానుల మధ్య ఆయన సంపాదించుకున్న ప్రేమ, తన విజయాలను చూస్తుంటే సంతోషంగా ఉందని చెప్పింది. అందుకు అజిత్‌ అర్హుడని పేర్కొంది. కండుకొండేన్‌ కండుకొండేన్‌ చిత్రంలో నటించినప్పుడు ఆయనతో తనకు ఎక్కువ సన్నివేశాలు లేకపోయినా, షూటింగ్‌ సమయంలో కలుసుకునే వారమని చెప్పింది. అంతే కాదు ఆయన కుటుంబ సభ్యులను కలుసుకున్న తీపి గుర్తులు ఉన్నాయని అంది. మళ్లీ అజిత్‌ను కలిస్తే ఆయన సాధించిన విజయాలకు శుభాకాంక్షలు తెలియజేయాలని కోరుకుంటున్నానని ఐశ్వర్యరాయ్‌ పేర్కొంది.

మరిన్ని వార్తలు