టాలీవుడ్‌ నటి ఆరోపణలు.. చిక్కుల్లో సిద్ధిఖీ

19 Mar, 2018 20:45 IST|Sakshi
నవాజుద్దీన్‌ సిద్ధీఖీ.. పక్కన నటి ఆకృతి నాగ్‌పాల్‌

సాక్షి, ముంబై : కాల్‌ డేటా రికార్డ్‌ స్కామ్‌(సీడీఆర్‌)లో నటుడు నవాజుద్దీన్‌ సిద్ధిఖీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. తన భార్యపై ప్రైవేట్‌ డిటెక్టివ్‌తో నిఘా వేయించి, ఆమె కాల్‌ డేటా సేకరించాడనే ఆరోపణలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ఆయనకు సహకరించిన లాయర్‌ రిజ్వాన్‌ సిద్ధిఖీని ఇప్పటికే పోలీసులు అరెస్ట్‌ కూడా చేశారు. 

అయితే ఈ కేసులో రిజ్వాన్‌పై టాలీవుడ్‌ నటి ఒకరు సంచలన ఆరోపణలు దిగారు. రిజ్వాన్‌ తన కాల్‌ డేటాను కూడా దొంగిలించాడని నటి ఆకృతి నాగ్‌పాల్‌ ఆరోపిస్తున్నారు. తెలుగులో చిన్న చిన్న పాత్రలు, బాలీవుడ్‌లో చిత్రాలతోపాటు మోడల్‌గానూ ఆమె గుర్తింపు పొందారు. సోమవారం థానే పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన ఆమె రిజ్వాన్‌కు వ్యతిరేకంగా స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. అంతేకాదు తన వైవాహిక జీవితం నాశనం కావటానికి రిజ్వాన్‌ కూడా ఓ కారణమని ఆమె అంటున్నారు. అనిల్‌ మిస్త్రీ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న ఆకృతి.. కాపురంలో కలతలు రేగటంతో 2014లో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. 

అయితే అనిల్‌కు స్నేహితుడు అయిన రిజ్వాన్‌ తన కాల్‌ డేటాను దొంగిలించి తన భర్తకు అందజేసి ఉంటాడని ఆమె అనుమానిస్తున్నారు. ‘నా వైవాహిక జీవితం నాశనం కావటానికి రిజ్వాన్‌ కారణం. అతను అనిల్‌కు చిన్ననాటి స్నేహితుడు. పైగా విడాకుల సమయంలో ప్రొత్సహించి మరీ మరో యువతితో అనిల్‌కు మరో సంబంధం కుదిర్చాడు. సీడీఆర్‌ వ్యవహారం వెలుగులోకి రావటంతో నా అనుమానాలు నిజమనే భావిస్తున్నా. రిజ్వాన్‌కు అండగా ఉంటున్నవారిని కూడా విడిచిపెట్టకండి’ అని ఆకృతి చెబుతున్నారు.

రిజ్వాన్‌ ఓ ప్రముఖ బాలీవుడ్‌ నటి డేటాను ఆమె భర్తకు అప్పగించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఇప్పుడు ఆకృతి ఆరోపణలతో కాల్‌ రికార్డింగ్‌ డేటా స్కామ్‌ పెద్ద వ్యవహారమే అయి ఉంటుందని థానే క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు చెబుతున్నారు. రిజ్వాన్‌ పాత్ర గనుక నిజమని తేలితే నవాజుద్దీన్‌కు కూడా కష్టాలు తప్పకపోవచ్చు. ఇప్పటికే ఈ స్కామ్‌లో పలువురి వీఐపీల హస్తం ఇందులో ఉందని చెబుతున్న పోలీసులు.. వారి పేర్లు వెల్లడించేందుకు సుముఖత వ్యక్తం చేయటం లేదు.

మరిన్ని వార్తలు