‘అప్పుడు నా సంపాదన నెలకు రూ.5 వేలు’

20 Nov, 2018 11:25 IST|Sakshi

కేవలం డబ్బు సంపాదించాలనే ఆలోచనే నన్ను ఫిల్మ్‌ ఇండస్ట్రీకి వచ్చేలా చేసింది అంటున్నారు బాలీవుడ్‌ ‘ఖిలాడి’ అక్షయ్‌ కుమార్‌. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన అక్షయ్‌ కుమార్‌ తన కెరీర్‌ తొలినాళ్లలో ఎదుర్కొన్న పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. ‘నేను ఇప్పటికి దాదాపు 130 దాకా సినిమాలు చేసి ఉంటాను. కానీ కెరియర్‌ తొలినాళ్లలో కేవలం యాక్షన్‌ సినిమాలు మాత్రమే చేశాను. దర్శకులు, నిర్మాతలు కేవలం నన్నో యాక్షన్‌ హీరోగా మాత్రమే గుర్తించేవారు’ అంటూ చెప్పుకొచ్చారు. మార్షల్‌ ఆర్ట్స్‌ స్కూల్‌ ప్రారంభించాలనే ఉద్దేశంతో బ్యాంకాక్‌ వెళ్లి ఐదేళ్ల పాటు థాయ్‌ బాక్సింగ్‌ నేర్చుకున్నాను అన్నారు.

తరువాత ‘ముంబై వచ్చి మార్షల్‌ ఆర్ట్స్‌ స్కూల్‌ ప్రారంభించాను. అప్పుడు మార్షల్‌ ఆర్ట్స్‌ ట్రైన్‌ర్‌గా నెలకు రూ. 5000 సంపాదించేవాడిని. నా పర్సనాలిటీ చూసిన కొందరు నన్ను మోడల్‌గా ప్రయత్నించమన్నారు. వారి సలహాతో నేను మోడలింగ్‌ ప్రయత్నాలు ప్రారంభించాను. తొలుత నేను ఓ ఫర్నిచర్‌ కంపెనీ యాడ్‌లో నటించాను. కేవలం రెండు గంటల పనికే నాకు రూ. 21,000 ఇచ్చారు. అలా నెమ్మదిగా ఇండస్ట్రీలో ప్రవేశించాను. కెరీర్‌ తొలినాళ్లలో దాదాపు 10 -11 సంవత్సరాలు యాక్షన్‌ సినిమాలే చేశాను. ఆ తర్వాత నెమ్మదిగా కామెడీ, రొమాంటిక్‌ సినిమాలు చేయడం ప్రారంభించాను’ అన్నారు. 1991లో ‘సౌగంధ’ సినిమాతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చారు అక్షయ్‌ కానీ మరుసటి ఏడాది వచ్చిన ‘ఖిలాడి’ సినిమా అక్షయ్‌ కెరియర్‌ను మలుపు తిప్పింది.

డబ్బు సంపాదించాలనే ఆలోచనతోనే ఇండస్ట్రీలోకి వచ్చాను అన్నారు అక్షయ్‌. 2018లో ఫోర్బ్స్‌ విడుదల చేసిన అత్యధిక పారితోషికం తీసుకునే నటుల జాబితాలో చేరారు ఈ ఖిలాడీ హీరో. ప్రస్తుతం అక్షయ్‌ విలన్‌గా నటించిన 2. ఓ విడుదలకు సిద్ధంగా ఉండగా.. హౌస్‌ఫుల్‌ 4, కేసరి చిత్రాలకు సైన్‌ చేశారు.

మరిన్ని వార్తలు