పదకొండు నెలలు కావస్తోంది అల్లు అర్జున్ స్క్రీన్ మీద కనిపించి. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ తర్వాత కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడానికి కాస్త సమయం తీసుకున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. కానీ ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు ఎప్పుడు వెళ్తుంది? తర్వాత చేయబోయే కొత్త ప్రాజెక్ట్ డీటైల్స్ ఏంటి? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. సోమవారం అల్లు అర్జున్ బర్త్డే. ఈ సందర్భంగా కొత్త చిత్రాల విశేషాలను అనౌన్స్ చేశారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోయే సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 24 నుంచి మొదలు కానుందని తెలిపారు. ఇందులో బన్నీకి జోడీగా పూజా హెగ్డే నటిస్తారు. గీతా ఆర్ట్స్, హారికా హాసినీ క్రియేషన్స్ బ్యానర్లు నిర్మిస్తాయి.
ఈ చిత్రం తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఇందులో రష్మికా మండన్నా కథానాయిక. మైత్రీ మూవీ మేకర్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ‘‘ఈ ప్రాజెక్ట్లో భాగమవ్వడం చాలా ఎగై్జటింగ్గా ఉంది’’ అని పేర్కొన్నారు రష్మిక. ఈ రెండు చిత్రాలు కాకుండా వేణు శ్రీరామ్ దర్శకుడిగా, ‘దిల్’ రాజు నిర్మాణంలో ‘ఐకాన్: కనబడుట లేదు’ అనే చిత్రం ఉంటుందని ప్రకటించారు. ‘ఆర్య, పరుగు, డీజే’ సినిమాల తర్వాత ‘దిల్’ రాజు బ్యానర్లో నాలుగోసారి నటించనున్నారు అల్లు అర్జున్. ఏడాది విరామం తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బన్నీ బిజీ బిజీ బిజీ కాబోతున్నారు.