'ప్రమోషన్స్ కోసం పబ్లిగ్గా డ్యాన్సులు చేయించలేను'

5 Jan, 2016 13:33 IST|Sakshi
'ప్రమోషన్స్ కోసం పబ్లిగ్గా డ్యాన్సులు చేయించలేను'

ముంబై: సినిమాల ప్రమోషన్స్ కోసం ఇప్పుడు నటీనటులు పడరానిపాట్లు పడటం చూస్తున్నదే. ముఖ్యంగా షాపింగ్ మాల్స్, పబ్లిక్ ప్రదేశాల్లో సినీ బృందమంతా చేరి స్టెప్పులు వేయడం ఇప్పుడు పరిపాటిగా మారింది.  కానీ అలాంటి ట్రెండ్ ను తాను అనుసరించబోనని చెప్తున్నారు  ప్రముఖ బాలీవుడ్ నిర్మాత విధూవినోద్ చోప్రా. సినిమా ప్రమోషన్స్ కోసం బిగ్ బీ అమితాబ్ బచ్చన్ లాంటి పెద్దాయనతో  పబ్లిగ్గా డ్యాన్సులు చేయించలేనని ఆయన స్పష్టం చేశారు.

'ఈ రోజుల్లో సినిమాను ప్రమోట్ చేయాలంటే.. ఏ మాల్కో వెళ్లి డ్యాన్స్ చేయాలన్నది ట్రెండ్గా మారింది. లేకపోతే సినిమా విడుదలవుతున్న సంగతి ప్రజలకు తెలిసే అవకాశం ఉండదు. అయితే, మా సినిమా ప్రమోషన్ కోసం ఇలా అమితాబ్తో చేయించడం వికృతంగా ఉంటుంది.  కేవలం ప్రమోషన్ కోసం నేను అమితాబ్తో పబ్లిగ్గా డ్యాన్స్ చేయించలేను' అని ఆయన తెలిపారు. అమితాబ్, ఫర్హాన్ అఖ్తర్ కలిసి నటిస్తున్న 'వజీర్' సినిమాను విధూ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా ప్రమోషన్ కోసం వినూత్న పద్ధతిని అనుసరిస్తున్నామని, ఈ సినిమాలోని 15 నిమిషాల నిడివి దృశ్యాలను విడుదలకు ముందే జర్నలిస్టులకు చూపించడం ద్వారా ఈ సినిమాను ప్రజల్లోకి తీసుకెళుతున్నామని ఆయన చెప్పారు. గతంలో 'మున్నాభాయ్ ఎంబీబీఎస్' వంటి ప్రముఖ సినిమాలను నిర్మించిన ఆయన 'వజీర్' చిత్రం కూడా ప్రేక్షకులకు చేరువ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.